రైళ్లలో నీటి కష్టాలకు చెక్.. అందుబాటులోకి క్విక్ వాటరింగ్ ప్రాజెక్ట్..
రైళ్లలో తరుచూ ప్రయాణించేవారికి ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణంలో నీటి కష్టాలు ఎదురయ్యే ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీళ్లు లేకపోవడం ప్రయాణికుల ఆందోళన చేయడం సర్వ సాధారణం. ఎండాకాలంలో అయితే ఇలాంటి ఇబ్బందులకు మరింత పెరుగుతాయి. కనీసవసరాలకు నీళ్లు లేక ప్రయాణీకులు నరకం అనుభవిస్తారు. ప్యాసింజర్లు ఎంత మొత్తుకున్నా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. కొన్నేళ్లుగా కంప్లైంట్లు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఎట్టకేలకూ రైల్వే శాఖ నీటి కష్టాలపై దృష్టి పెట్టింది.
నీళ్లు నింపేందుకు అరగంట
రైళ్లలో నీటి కష్టాల గురించి అధికారులకు తెలిసినా ఆ ఇబ్బందులు తొలగించకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ప్రస్తుతం ప్రధాన స్టేషన్లలో మాత్రమే బోగీల్లోని ట్యాంకుల్లో నీళ్లు నింపే సౌకర్యం ఉంది. ఒక ట్రైన్లోని అన్ని బోగీల్లో నీళ్లు నిపాలంటే కనీసం 20 - 30 నిమిషాల సమయం పడుతుంది. అంతసేపు ఒక రైలును స్టేషన్లో ఆపితే ఆ తర్వాత వచ్చే ట్రైన్స్ షెడ్యూల్పై ప్రభావం పడుతుంది. ఆ కారణంగానే అధికారులు అరకొరగా నీటిని నింపి చేతులు దులుపుకుంటున్నారు.
వేసవిలో 42శాతం నీటి ఫిర్యాదులు
దూర ప్రాంతాలకు వెళ్లే చాలా రైళ్లలో నీటి సమస్య సర్వసాధారణం. ఎండాకాలంలో ఈ కష్టాలు మరింత పెరుగుతాయి. వేసవిలో రైల్వే శాఖకు అందే ఫిర్యాదుల్లో 42శాతం నీటికి సంబంధించినవే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏళ్లుగా ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా వారి ఇబ్బందులు తొలగించేందుకు ఎట్టకేలకూ రైల్వే శాఖ సిద్ధమైంది
4 నిమిషాల్లో 40వేల లీటర్లు
నీటి కొరతను తీర్చేందుకు దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో క్విక్ వాటరింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రస్తుతం రైలులోని అన్ని బోగీల్లో ట్యాంకులు నింపేందుకు పడుతున్న సమయం గణనీయంగా తగ్గింది. దాదాపు నాలుగు నిమిషాల వ్యవధిలోనే 40వేల లీటర్ల నీటిని నింపే అవకాశం లభిస్తుంది. ఫలితంగా రైళ్లలో నీటి కొరత అనే ప్రశ్నే లేకుండా పోతుంది.
ఎలా పనిచేస్తుందంటే
క్విక్ వాటరింగ్లో భాగంగా రైల్వే శాఖ బోగీల్లో నీళ్లు నింపే పాత పైప్లైన్లను మార్చింది. ఒక్కో చోట నాలుగు చొప్పున 40 హెచ్పీ సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసింది. పైప్లైన్లను బోగీల ట్యాంకుల కున్న పైప్లతో అనుసంధానించి మోటర్ ఆన్ చేయగానే కేవలం 4నుంచి 5 నిమిషాల్లో ఏకకాలంలో అన్ని బోగీల ట్యాంకులు నిండిపోతాయి. అంతేకాదు... ఈ విధానం ద్వారా ఒకే సమయంలో పక్కలైన్లో ఉన్న ట్రైన్లలోనూ నీళ్లు నింపేలా వెసలుబాటు ఉంది. ఫలితంగా నాలుగు నిమిషాల్లోనే రెండు రైళ్ల ట్యాంకుల్లో నీటిని నింపేయొచ్చు. సెన్సార్, రిమోట్ సాయంతో పనిచేసే క్విక్ వాటరింగ్ సిస్టం ట్యాంకుల్లో నీళ్లు నిండగానే ఆటోమేటిక్గా పంపింగ్ నిలిచిపోతుంది. మోటార్ దగ్గర నుంచే రిమోట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో 3 స్టేషన్లలో
క్విక్ వాటర్ సిస్టం కోసం రైల్వే బోర్డు గతేడాది 300కోట్లు విడుదల చేసింది. దేశంలో 142 స్టేషన్లలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో పనులు పూర్తికావచ్చాయి. త్వరలోనే మరిన్ని స్టేషన్లను క్విక్ వాటరింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.