రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా.. జాగ్రత్త: నేటి నుంచి 22 దాకా స్పెషల్ డ్రైవ్
Recommended Video
న్యూఢిల్లీ: టిక్కెట్ లేకుండా రైల్వేలో ప్రయాణించడం నేరం. అయినప్పటికీ చాలామంది టిక్కెట్ తీసుకోకుండా ప్రయాణిస్తారు. టిక్కెట్ కలెక్టర్లకు దొరకకుండా చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు కొందరు. తాజాగా రైల్వే శాఖ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తుంది.
జూన్ 8 (నేడు) నుంచి జూన్ 22వ తేదీ వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఈ నెల 23న ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ డ్రైవ్లో టికెట్ లేని ప్రయాణికులకు భారీగా జరిమానాలు విధించనుంది. టికెట్ ట్రాన్స్ఫర్, టికెట్ లెస్, నకిలీ, ఫోర్జ్డ్ టికెట్లపై దృష్టి సారిస్తున్నారు. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లను నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చేందుకు చర్యలు ప్రారంభించిన రైల్వే ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రైలు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన సేవలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా టికెట్ బుకింగ్ను మరింత సులభతరం చేయనుంది. ఇరవై గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో భోజనం కోసం బయో డిస్పోజబుల్ ప్లేట్లు, వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచనుంది.
మరోవైపు, ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో లగేజీ నిబంధనలపై రైల్వే శాఖ వెనక్కి తగ్గింది. అధిక లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై జరిమానా విధించాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. అధిక లగేజీ ఉంటే ప్రయాణికులకు జరిమానా విధించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది.
దీనిపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మండిపడ్డారు. దీంతో రైల్వే శాఖ వెనక్కి తగ్గింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. ప్రయాణికులకు అవగాహన కల్పించడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం తప్పితే, వారిని ఇబ్బంది పెట్టాలని కాదని పేర్కొంది.
కాగా, రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన, విడిచిపెట్టిన, పారిపోయి వచ్చిన, అక్రమ రవాణాకు గురవుతున్న చిన్నారులను గుర్తించేందుకు 174 రైల్వే స్టేషన్లలో చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.