రైల్వే బోర్డు కీలక నిర్ణయం.... ఇక ఆ వ్యవస్థకు ముగింపు దిశగా....
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఖలాసీ వ్యవస్థకు ముగింపుల పలకాలని నిర్ణయించింది. దీంతో బ్రిటీష్ వలస పాలన నుంచి కొనసాగుతూ వస్తున్న 'ఖలాసీ' వ్యవస్థకు ఇక ఫుల్ స్టాప్ పడనుంది.ఖలాసీలనే బంగ్లా ప్యూన్స్ అని కూడా పిలుస్తారు. రైల్వే ఉన్నతాధికారులు,సీనియర్ అధికారుల ఇళ్ల వద్ద వీరు పనిచేస్తారు. అధికారుల ఇళ్లల్లో ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం,ఫైల్స్ అందించడం వంటి పనులు చేస్తుంటారు.
'టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ ఖలాసీ(TADKs) అపాయిమెంట్ల అంశాన్ని రైల్వే బోర్డు సమీక్షకు పెట్టింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఖలాసీ వ్యవస్థలో కొత్త పోస్టుల భర్తీ చేపట్టకూడదు. అలాగే జూలై 1,2020 తర్వాత ఖలాసీలుగా అపాయింట్ అయినవారి ఉద్యోగాలపై కూడా పున:సమీక్ష జరుగుతుంది.' అని తాజా ఉత్తర్వుల్లో రైల్వే బోర్డు పేర్కొంది.
ఖలాసీలు రైల్వేలో గ్రూప్-డీ పరిధిలోకి వస్తారు. వీరి పోస్టింగ్స్ అధికారుల ఇళ్ల వద్ద కావడంతో.. వీరిని వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలికేందుకు రైల్వే సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఇటీవలే డార్క్ మెసేంజర్(ప్యూన్) సేవలకు కూడా రైల్వే ముగింపు పలికింది. సాధారణంగా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ని ఉద్యోగులు,అధికారులకు చేరవేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోపడేది. ప్రత్యేకంగా ఓ ప్యూన్ వెళ్లి ఆ డాక్యుమెంట్స్ని వారికి చేరవేసేవాడు.అయితే ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఈ వ్యవస్థకు బదులు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది.
Recommended Video
ఈ ఏడాది ఆరంభంలో రైల్వేలో కొత్త పోస్టుల భర్తీని కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే ఉన్న సిబ్బందిని కూడా రేషనలైజ్ చేయాలని నిర్ణయించింది. అలాగే సిబ్బందిపై చేస్తున్న ఖర్చు విషయంలోనూ నియంత్రణ పాటించాలని ఇప్పటికే అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు,సిబ్బందిని కేవలం ఒక పనికే పరిమితం చేయకుండా మల్టిపుల్ టాస్క్ అప్పగించాలని సూచించింది. అలాగే రైల్వేకి సంబంధించిన ఎలాంటి వేడుకలైనా ఇకపై డిజిటల్ మాద్యమాల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది.