రద్దీ దృష్ట్యా 2500 అదనపు సర్వీసులను నడపనున్న భారతీయ రైల్వేలు
న్యూఢిల్లీ: రానున్న పండగలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తూ భారతీయ రైల్వేలు అదనంగా 2500 అదనపు సర్వీసులను నడపనున్నాయి. ఇందులో 400 స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ నడపనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణికులకు అనుకూలంగా రైళ్లను నడపడంతో పాటు రద్దీని కూడా తగ్గించేందుకే ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరిన వచ్చే క్రిస్మస్ వరకు ఈ రైళ్లు నడుపుతామని స్పష్టం చేసింది రైల్వేశాఖ.
ఢిల్లీ - పాట్నా, ఢిల్లీ - కోల్కతా, ఢిల్లీ - ముంబై, ముంబై - లక్నో, చండీగఢ్ - గోరక్పూర్, ఢిల్లీ - చాప్రా, హౌరా - కతిహార్, హరిద్వార్ - జబల్పూర్లకు ప్రత్యేక రైళ్లను నడపనుంది రైల్వేశాఖ. ఇక పండగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో అన్ని జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ తీసుకుంటోంది. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ప్రయాణికులు రైల్వే ప్లాట్ఫామ్పైకి వచ్చి రైలు ఎక్కేవరకు ఆర్పీఎఫ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారని రైల్వేశాఖ వెల్లడించింది.
ఇక ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు ఆర్పీఎఫ్ బలగాలను ఉంచుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇక ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ శాఖలకు సంబంధించి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని రైల్వే తెలిపింది. అంతేకాదు రైలు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోతే వెంటనే అక్కడకు సిబ్బంది చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
ఇక రైళ్ల రాకపోకలు సవ్యంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన అధికారులు ప్లాట్ఫాంపైకి అనుకున్న సమయానికే వచ్చేలా చూస్తామని చెప్పారు. ఇక ప్రధాన స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ అనే టోల్ఫ్రీ నెంబరును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయా రైల్వే జోన్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికులకు సహాయం చేసేందుకు టీటీఈలు, ఆర్పీఎఫ్ సిబ్బంది వెళతారని తెలిపారు. ఇక ప్రధాన స్టేషన్లలో అంబులెన్స్లతో పాటు పారామెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇక షెడ్యూల్ ప్రకారమే అన్ని మెయిల్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.