శ్రీరాముడు నడియాడిన నేలకు భక్తులను తీసుకెళ్లనున్న భారతీయ రైల్వేలు
న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను భక్తులకు చూపించేందుకు భారతీయ రైల్వే సంస్థ శ్రీకారం చుట్టబోతోంది. శ్రీరాముడు భారత్తో పాటు శ్రీలంకలో కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. భారత్లో అయితే రైలులో భక్తులను తిప్పేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. ఇక శ్రీలంకకు తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి విమానంలో తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది ఐఆర్సీటీసీ. శ్రీరాముడి జీవితంతో ముడిపడిన ప్రాంతాల్లో భక్తులను తిప్పనుంది.
గతేడాది అంటే 2018లో నాలుగు ప్యాకేజీలను ఐఆర్సీటీసీ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టింది. అయితే ఈ సారి మాత్రం రెండు ప్యాకేజీలను మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇక భారత్లో 16 రోజులు 17 రాత్రులుతో కూడిన ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ. 16,065 ఉంటుండగా అదే శ్రీలంకకు వెళ్లాలనుకుంటే ప్యాకేజీ ధర రూ. 36,950గా ధర నిర్ణయించడం జరిగిందని ఐఆర్సీటీసీ వివరించింది. ఇక శ్రీరామయాత్ర పేరుతో ప్రారంభం కానున్న ఈ తీర్థయాత్ర రాజస్థాన్లోని జైపూర్ నుంచి ఢిల్లీ మీదుగా నవంబర్ 3వ తేదీన రైలు బయలుదేరుతుందని తెలిపింది. ఇక మరో రైలు రామాయణ ఎక్స్ప్రెస్ పేరుతో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి ప్రారంభం అవుతుందని ఇది వారణాసి మీదుగా నవంబర్ 18న బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ వివరించింది. మదురై నుంచి కూడా మరో రైలును ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
గతేడాది డిసెంబర్ 14న ప్రారంభించిన సమయంలో ఇటు భారత్తో పాటు అటు శ్రీలంక నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రయాణించారని ఐఆర్సీటీసీ పేర్కొంది. ఇక భారత్లో శ్రీరాముడి జీవితంతో ముడిపడిన ప్రాంతాలు అయోధ్యలోని రామజన్మభూమి హనుమాన్ గర్హిలు ఉండగా, నందిగ్రామ్లో భారత్ మందిర్, బీహార్లో సీతామాతా మందిర్, తులసి మానస్ మందిర్, వారణాసిలోని సంకత్ మోచన్ మందిర్, సీతా సమాహిత్ స్థల్, త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, ప్రయాగలోని భరద్వాజ్ ఆశ్రమం, శృంగవేర్పూర్లోని శృంగిరిషి మందిర్, చిత్రకోట్లోని సతి అనసూయ మందిర్, నాసిక్లోని పంచవతి, అంజనాద్రి కొండ, హంపిలోని హనుమాన్ జన్మస్థల్, రామేశ్వరంలోని జ్యోతిర్లింగా శివ మందిర్కు తీసుకెళతారు. ఇక శ్రీలంకలో సీతామాతా మందిర్, అశోక వనం, విభీషణ ఆలయం, మున్నేశ్వరంలోని శివాలయంను తీసుకెళ్లి చూపించనున్నారు.