చైనాలో భారత కరెన్సీ ముద్రణ?: కొట్టిపారేసిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనాతో భారత కరెన్సీ ముద్రణకు ఒప్పందం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆ వాదనలో వాస్తవం లేదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాగ్ గార్గ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. చైనాలోని ఓ కరెన్సీ ప్రింటింగ్ కార్పొరేషన్తో భారత్ ఒప్పందం చేసుకుందనేది కేవలం నిరాధార వాదనని కొట్టిపారేశారు.
భారత కరెన్సీ కేవలం భారత్లోనే ముద్రించడం జరుగుతోందని, అది కూడా ఆర్బీఐ మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు. చైనాకు చెందిన 'ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' అనే పత్రికలో భారత్తో సహా పలు దేశాలకు చెందిన కరెన్సీని ముద్రించేందుకు చైనా బ్యాంక్నోట్ అండ్ మింటింగ్ కార్పొరేషన్తో ఒప్పందం జరిగిందంటూ కథనం వెలువరించింది.
కరెన్సీ ముద్రణ కోసం థాయిలాండ్, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, ఇండియా, బ్రెజిల్, పోలాండ్ దేశాలతో ఒప్పందం జరిగినట్లు సంబందిత కంపెనీ అధ్యక్షుడు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది.
ఒక వేళ ఈ వార్తా కథనం నిజమైతే దేశ భ్రదతను సమాధి చేస్తున్నట్లేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ చైనా పత్రిక కథనంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.