ఆ గొంతు మూగబోయింది: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు..!
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గురువారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించారు. బాలును కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు.
Recommended Video
గత నెలలో ఆస్పత్రిలో చేరిన బాలు
కరోనావైరస్ పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఎస్పీ బాలు గత నెల ఆగష్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. కొన్ని రోజులకు బాలుకు నెగిటివ్ అని వచ్చింది. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడక పోవడంతో అక్కడే వెంటిలేటర్పై చికిత్స అందించారు వైద్యులు. గురువారం రోజున బాలు ఆరోగ్యం మరింత క్షీణించి విషమంగా మారింది. ఇక బాలు ఆత్మీయులు మిత్రులు కూడా హాస్పిటల్కు చేరుకోవడంతో అక్కడ కాస్త ఆందోళన వాతావరణం కనిపించింది.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను కుమారుడు ఎస్పీ చరణ్ ధృవీకరించారు. సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఎస్పీ చరణ్ చెప్పారు. ఎంజీఎం హాస్పిటల్ నుంచి చెన్నై కోయంబేడులోని తన నివాసంకు బాలు భౌతికకాయాన్ని తరలించనున్నట్లు ఎస్పీ చరణ్ చెప్పారు. ఇక బాలు ఆత్మీయమిత్రుడు భారతీరాజా కన్నీటి పర్యంతమయ్యాడు. బాలు తిరిగి వస్తారన్న నమ్మకం తనకు ఉన్నిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అందరి ప్రార్థనలు భగవంతుడు వింటాడన్న నమ్మకం ఉన్నిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. భగవంతుడు 10 రోజులు మాత్రమే బాలును స్థిరంగా నిలబెట్టాడని చెప్పారు భారతీరాజ
బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు
నెల్లూరు జిల్లాలో 1946 జూన్ 4వ తేదీన సాంబమూర్తి శకుంతలా దేవీలకు బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. ఇంజినీర్ అవ్వాల ని తొలుత భావించినప్పటికీ మధ్యలోనే విరమించుకుని సింగర్గా స్థిరపడ్డారు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లో ఎన్నో పాటలు పోటీల్లో పాల్గొని చాలా బహుమతులు గెలుచుకున్నారు. ఇక 1966లో తొలిసారిగా ఒక సినిమాకు పాట పాడారు. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రానికి తొలిసారిగా పాట పాడి తన సినీ కెరీర్ను ప్రారంభించారు బాలసుబ్రహ్మణ్యం. అప్పుడు ప్రారంభమైన తన పాట తన చివరి శ్వాస వరకు అలరించింది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోను బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు.
ఊపు ఊపిన బాలు -ఇళయరాజ ద్వయం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు విదేశాల్లో కూడా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. తన గొంతు ఖండాంతరాలను తాకింది. శంకరాభరణంలో బాలు పాడిన పాటలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆ చిత్రానికి కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.1981లో ఏక్ దుజే కేలియే చిత్రానికి పాడి బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో పాడిన పాటకు జాతీయ అవార్డు బాలును వరించింది. ఇక తన ఆప్త మిత్రుడు సంగీత దర్శకుడు ఇళయరాజ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు. వీరిది ఎప్పటికీ హిట్ పెయిర్గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాగరసంగమం, స్వాతిముత్యం,రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డు వరించింది.
బాలీవుడ్లోను బాలుకు క్రేజ్
ఇక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కు పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం. 1989లో వచ్చిన సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మైనే ప్యార్ కియా చిత్రంలో దిల్ దీవానా పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు బాలును వరించింది. ఆ తర్వాత మరో దశాబ్దకాలం పాటు సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలకు రొమాన్స్ పాటలకు గాత్రం అందించారు బాలు. ఇక హమ్ ఆప్కే హే కోన్ చిత్రానికి లతా మంగేష్కర్తో కలిసి దీదీ తేరా దేవర్ దివానా అనే పాటను బాలు పాడారు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో బాలు క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఏఆర్ రెహ్మాన్ ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారంటే అందులో బాలు గొంతు వినిపించాల్సిందే. రెహ్మాన్ తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన రోజా చిత్రంలో బాలు పాడిన నా చెలి రోజావే పాట అభిమానుల్లో ఎలాంటి ముద్ర వేసిందో చెప్పక్కర్లేదు.
ఇక నటుడిగా కూడా బాలు చాలా చిత్రాల్లో నటించి మంచి నటుడిగాను గుర్తింపు పొందాడు. తన గాత్రంతో దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ దిగ్గజ గాయకుడు ఇక లేరనే వార్తను సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.