జాబ్స్ గోవిందా: భారత టెక్కీలకు దినదిన గండం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల అమలుకు ఐటీ కంపెనీలు పూనుకుంటున్నాయి. హెచ్ 1 బీ వీసా వినియోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాల తాలూకు ఘాటు ప్రభావం అప్పు
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల అమలుకు ఐటీ కంపెనీలు పూనుకుంటున్నాయి. హెచ్ 1 బీ వీసా వినియోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాల తాలూకు ఘాటు ప్రభావం అప్పుడే భారత ఐటీ సంస్థలు, అందులో పని చేస్తున్న ఉద్యోగులకును బాగానే తాకుతున్నది. 'హైర్ అమెరికన్' సెగ భారత టెకీలకు బాగా తగులుతోంది.
హెచ్-1బీ వీసాలపై కఠిన ఆంక్షలతో ఇన్ఫోసిస్ ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టగా.. కాగ్నిజెంట్ ముందుకుతీసుకుపోతున్నట్టు కనిపిస్తోంది! ఐటీ కంపెనీలు అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లో పెట్టుకునేందుకు భారతీయ ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
కాగ్నిజెంట్లో 30 వేల మందికి ఉద్వాసన పలికిన సంస్థ యాజమాన్యం.. హైదరాబాద్లోనే 4,000 మంది ఇంటికి పంపేసింది. ఇదే బాలో టెక్ మహీంద్రా, విప్రో తదితర సంస్థలు పయనించనున్నాయని తెలుస్తోంది. పనితీరు సరిగా లేని ఉద్యోగులను ఏటా అర శాతం నుంచి ఒక శాతం మేర ఇంటికి పంపించడం ఏ కంపెనీకైనా సర్వసాధారణమే. కానీ, అందుకు భిన్నంగా ఇలా వేల మంది ఐటీ నిపుణులను ఇంటికి పంపడం మాత్రం ఆందోళనకరమే. సాధారణంగా ఏ సంస్థ అయినా లాభనష్టాల బేరీజుతోనే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
10 వేల మంది అమెరికన్లను నియమించుకోనున్న ఇన్ఫోసిస్
గల్లీలో కిళ్లీకొట్టు మొదలు కార్పొరేట్ కంపెనీల వరకూ.. ఎవరైనా బ్యాలెన్స్ షీటులో మొగ్గు లాభం వైపు ఉండేలా చర్యలు తీసుకుంటారు. వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్ ఉద్యోగులను నియమించుకోనున్నామని ఇన్ఫోసిస్ గత నెలలోనే ప్రకటించింది. విప్రో కూడా అమెరికన్ ఉద్యోగుల నియామకాలను పెంచుకోవడానికి సంసిద్ధం కావడంతోపాటు 600 మందిని తొలగించింది.
ఇప్పుడు కాగ్నిజెంట్ చేస్తున్న పని.. చాప కింద నీరులా ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన చెబుతున్న పలు ఇతర కంపెనీలు అమెరికాలో స్థానికుల నియామక ప్రక్రియలో భాగమేనని నిపుణులు చెప్తున్నారు. ‘కాగ్నిజెంట్' ఆదాయంలో 75 శాతానికి పైగా అమెరికా నుంచి వస్తున్నదే. అందుకే ఇన్నాళ్లూ భారత ఐటీ నిపుణులతో హెచ్-1బీ వీసాలపై పని చేయించుకున్న ‘కాగ్నిజెంట్'.. ట్రంప్ వచ్చాక పరిస్థితి మారడంతో హెచ్-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించుకున్నది.
స్థానికులపై ఎక్కువగా ఆధారపడాలని నిర్ణయించుకున్నట్టు కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజీవ్ మెహతా తెలిపారు. ‘గత ఏడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువ (హెచ్-1బీ) వీసాలకే దరఖాస్తు చేశాం. మున్ముందు మరింత తగ్గించుకోవాలనుకుంటున్నాం'' అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.
లక్షల కుటుంబాల భవిష్యత్ ప్రశ్నార్థకమే
ఉద్యోగుల తగ్గింపు ప్రణాళికలో భాగంగానే.. కొన్నాళ్లుగా ఆ సంస్థ ఉద్యోగుల్లో పెద్ద హోదాల్లో ఉన్నవారిని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కాగ్నిజెంట్ కోరుతోంది. ఒకవిధంగా బతిమాలుతోందని సమాచారం. వారికి తొమ్మిది నెలల జీతం ఇవ్వడానికి సిద్ధపడుతోంది. చిన్న ఉద్యోగులకైతే నాలుగైదు నెలల జీతం ఆఫర్ చేస్తోంది. కాగ్నిజెంట్లాగానే మిగతా కంపెనీలూ అమెరికాలో స్థానికులకు మరిన్ని ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇలా భారతీయ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు, అక్కడి నష్టాన్ని ఇక్కడ పూడ్చుకుంటున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. హెచ్-1బీ వీసాలను జారీ చేయడానికి ఇప్పటికీ పాత నిబంధనలే అమలవుతున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. చట్టాల్ని మార్చి కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని భారత టెకీలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అదే జరిగితే లక్షల కుటుంబాలు.. వారిపై ఆధారపడిన పలు రంగాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్ 1 బీ వీసా ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టుల్లేవ్
ఇక్కడ మనవారి ఉద్యోగాల సంగతి ఇలా ఉంటే.. అమెరికాలో ఇప్పటికే హెచ్ - 1 బీ వీసాపై పని చేస్తున్నవారి పరిస్థితి దినదిన గండం నూరేళ్లాయుష్షులా ఉంది. ఎందుకంటే.. హెచ్-1బీ వీసాను తొలుత మూడేళ్లకాలానికి ఇస్తారు. అవసరమైతే మరో మూడేళ్ల వరకూ పొడిగిస్తారు. అయితే, ఆ వీసాలపై వెళ్లినవారి ప్రాజెక్టులు 12-24 నెలల వ్యవధిలో ముగుస్తాయి. ఒక ప్రాజెక్టు పూర్తికాగానే మరో ప్రాజెక్టు కేటాయిస్తారు. కానీ ఇప్పుడు హెచ్ - 1 బీ పై పని చేస్తున్నవారి ప్రాజెక్టులు పూర్తయినా.. కొత్తవి ఇవ్వకుండా మొండిచెయ్యి చూపుతున్నారు. వచ్చిన ప్రాజెక్టులను భారతీయులు ఉండే టీమ్కు కాకుండా వేరేవారికి కేటాయిస్తున్నారు. కాదని బయటికొస్తే వేరే కంపెనీలో ఉద్యోగం దొరకని పరిస్థితి.
మూడు నెలల్లో ఉద్యోగం లేదంటే స్వదేశీ పయనం
హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లినవారు.. ఉద్యోగం మానేసినా, కంపెనీయే వారిని తీసేసినా, మూడు నెలల్లో మరో కొత్త ఉద్యోగం వెతుక్కోగలిగితే సరి లేదంటే స్వదేశానికి తిరుగు ప్రయాణం చేయాల్సిందే. దీంతో అలాంటివారు ఏదో ఒక కంపెనీలో కొనసాగుతున్నట్టు, పేరోల్స్లో ఉన్నట్లు చూపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. జీతం ఇవ్వకున్నా.. తాము ఆ సంస్థ ఉద్యోగులమని చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్ర వంటి సంస్థలు భారతీయ ఉద్యోగులు ప్రతి 10 మందిలో ఆరుగురిని స్వదేశానికి తిప్పి పంపుతున్నట్టు సమాచారం.