మరో మార్గం: భారత టెక్కీ సంస్థలకు వరంలా మారిన ఈబీ-5 వీసాలు
బెంగళూరు: అమెరికా తన వీసా నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో భారత టెక్ కంపెనీలు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇప్పటి వరకు తమ వ్యాపారానికి హెచ్-1బి వర్క్ వీసాలనే నమ్ముకున్న కంపెనీలో ఇక ఇన్వెస్ట్మెంట్ వీసాలపై దృష్టి సారించాయి.
హెచ్-1బి వర్క్ వీసాలపై ట్రంప్ సర్కారు నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో భారతీయ టెక్ కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ వీసాలే వరంలా కనిపించాయి.
ఈబీ-5 వీసానే దిక్కు
ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ కంపెనీలు ఈబీ-5 వీసాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈ వీసాల కింద భారత్ కంపెనీల నుంచి కొంత మంది టాప్ ఎగ్జిక్యూటీవ్లు అమెరికా వెళ్లి అక్కడ ఉండిపోతారు. ఈ వీసాల ద్వారా శాశ్వత నివాసం ఏర్పరచుకునే అవకాశం కూడా ఉండటం గమనార్హం.
అసలు ఈబీ-5 వీసా అంటే..
వలసలకు సంబంధించిన విధానాల్లో ఈబీ-5 ఒకటి. ఈ విధానంలో అమెరికా వలసవచ్చేవారికి శాశ్వత నివాసం కల్పిస్తారు. కానీ, వచ్చేటప్పుడు 5,00,000 డాలర్ల(రూ.3కోట్లు) ప్రాజెక్టును పెట్టుబడిగా తీసుకొని రావాలి. ఆ ప్రాజెక్టు ద్వారా అమెరికాలో కనీసం 10 ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది.
ఈవీ-5 వీసాల వైపే మొగ్గు
కన్సల్టెంట్ సెంటర్లు కూడా భారతీయ కంపెనీలు ఎంపిక చేసిన ఉద్యోగులను ఈబీ-5 వీసాలు కింద పంపించే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. సాధారణంగా భారతీయ కంపెనీలు ఈ వీసాలను వినియోగించవు. సీనియర్ ఎగ్జిక్యూటీవ్ల కోసం ఎల్1ఏ, స్పాన్సర్ గ్రీన్ కార్డ్, మల్టీనేషనల్ మేనేజర్ వీసాలను వినియోగిస్తున్నాయి.
బయటకు చెప్పడం లేదు కానీ,
తొలుత ప్రయోగాత్మకంగా 5 నుంచి 10 మంది ఉద్యోగులను ఈ వీసాల కింద పంపించి పరిశీలించాలని.. ఆ తర్వాతే అవసరమైన మార్పులతో ఉద్యోగులను పంపాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు పెద్దకంపెనీలు ఆసక్తి చూపడంలేదు. మరోపక్క అమెరికా ప్రభుత్వం ఈబీ-5 వీసాలపై ఇంకా దృష్టిపెట్టలేదు. ఈ వీసాలకు అనుమతించే మొత్తాన్ని 5,00,000 డాలర్ల నుంచి 9,20,000 డాలర్లకు పెంచాలనే ప్రతిపాదన ఒకటి మాత్రం పరిశీలనలో ఉండటం గమనార్హం.
ఇబ్బందిగా మారిన నేపథ్యంలో..
ఇంతకుముందు భారత ఉద్యోగులు సాధారణంగా హెచ్-1బి వీసాల కింద అమెరికాకు వెళ్లేవారు. అక్కడ వినియోగదారుల వద్ద ఉండి సేవలు అందించేవారు. కానీ సవరించిన నిబంధనల ప్రకారం అత్యధిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు మాత్రమే అమెరికా వెళ్లే అవకాశం ఉంది. దీనికి తోడు వీరికి ఇచ్చే వేతనాలు అమెరికా చట్టాలకు లోబడి బాగా ఎక్కువగా ఉండటంతో భారతీయ కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు ఈబీ-5 వీసాల కింద వెళ్లిన వారు అమెరికాలోని రియల్ ఎస్టేట్ రంగంలో, ఆసుపత్రుల నిర్మాణ రంగంలో, రెస్టారెంట్లలో, స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టారు. సుమారు 400మందికిపైగా ఉద్యోగులను పంపించేందుకు ఐటీ కంపెనీలు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నట్లు తెలిసింది.