డ్రాగన్..తప్పు చేసింది చాలక: మా భూభాగంపైకి భారత సైనికుల చొరబాటుయత్నం: చైనా
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి తాజాగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై చైనా ఎదురుదాడికి పాల్పడుతోంది. భారత్ చర్యలను తప్పు పడుతోంది. భారత సైనికులే తప్పు చేశారంటూ కౌంటర్ అటాక్ ఇస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ లేక్ దక్షిణ తీరం వైపు నుంచి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారంటూ వస్తోన్న వార్తలను తోసి పుచ్చింది. భారత సైనికులే ఆ పని చేశారని వెల్లడించింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Recommended Video
అధికారిక వెబ్సైట్లో
భారత సైనికులు పంగ్యాంగ్ త్సొ తీరం నుంచి అనధికారికంగా మరోసారి వాస్తవాధీన రేఖను దాటారని పేర్కొంది. ఫ్రంట్లైన్ బలగాలను నియంత్రించుకోవాలంటూ చైనా.. భారత ప్రభుత్వాన్ని కోరుతోందని పేర్కొంది. దీనిపై ఓ సమగ్ర వివరణను ఇచ్చింది. దీన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. భారత్లోని చైనా రాయబారి పలు కీలక అంశాలను ఇందులో పొందుపరిచారు. తప్పంతా భారత సైనికులదేనని పేర్కొన్నారు.
ఆగస్టు 31వ తేదీన చోటు చేసుకున్నట్లుగా..
ఆగస్టు 31వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా రాయబారి పేర్కొన్నారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య వివిధ దశల్లో చర్చల ప్రక్రియ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైనికులు నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. వాస్తవాధీన రేఖ సమీపంలోని పంగ్యాంగ్ త్సొ లేక్, సరిహద్దుల్లో పశ్చిమ సెక్టార్ పరిధిలోని రెక్కిన్ పాస్ వద్ద భారత సైనికులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని అన్నారు. సరిహద్దులను దాటుకుని తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారని చైనా రాయబారి తెలిపారు.
ఉద్రిక్తతలకు కారణం వారే..
భారత జవాన్లు తమ దేశ సైనికులు అడ్డుకున్నారని, ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చైనా భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి భారత జవాన్లు ప్రయత్నించారని, ఇది తమ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే చర్యగా తాము భావిస్తున్నట్లు చైనా రాయబారి తెలిపారు. ఇదివరకు భారత్తో తమ దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రొటోకాల్స్ను ఉల్లంఘించినట్టేనని చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతోన్న శాంతియుత వాతావరణానికి ఈ చర్యలు ధ్వంసం చేసినట్టయిందని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య
భారత జవాన్ల చర్యలు రెండు దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతోన్న చర్చల ప్రక్రియకు ఆటంకం కల్పించేవిగా, ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చడానికి క్షేత్రస్థాయిలో తీసుకుంటోన్న చర్యలకు ప్రతిబంధకంగా మారినట్లు భావిస్తున్నామని చైనా రాయబారి తెలిపారు. ఇలాంటి రెచ్చగొట్టే, శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసే చర్యలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఇకముందు ఇలాంటి ధోరణి ఉండబోదని ఆశిస్తున్నామని అన్నారు.
ఫ్రంట్లైన్ బలగాలను అదుపు చేయండి..
ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా రాయబారి తెలిపారు. తక్షణ నివారణ చర్యలను చేపట్టాలని అన్నారు. భారత ప్రభుత్వం వెంటనే సరిహద్దుల్లో మోహరింపజేసిన తమ ఫ్రంట్లైన్ బలగాలను అదుపు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే చర్యలు, అక్రమంగా తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడాన్ని అరికట్టాలని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే ఎలాంటి చర్యలను తాము సమర్థించబోవట్లేదని అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులను అదుపు చేయాలని భారత ప్రభుత్వానికి కోరుతున్నట్లు పేర్కొన్నారు.
భారత వాదనతో ఏకీభవించనట్టేనా?
తాజాగా చైనా రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలు.. చర్చనీయాంశమౌతున్నాయి. నిజానికి- ఆర్మీ అధికారులు ఆగస్టు 31వ తేదీన (సోమవారం) విడుదల చేసిన ప్రకటన ప్రకారం..చైనా సైనికులు శని, ఆదివారాల్లో భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. ఈ రెండు తేదీలను చైనా రాయబారి తన తాజా ప్రకటనలో ఎక్కడా పొందుపర్చకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 31వ తేదీన భారత సైనికులు తమ దేశ భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. 29, 30 తేదీల నాటి సంఘటనల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.