దుబాయ్లో దారుణం: వైద్యం వికటించి..భారతీయ మహిళ కన్నుమూత
దుబాయ్: దుబాయ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యం వికటించి భారతీయ మహిళ ఒకరు కన్నుమూశారు. ఆమె పేరు బెట్టి రీటా ఫెర్నాండెజ్. 42 సంవత్సరాలు. ముంబైకి చెందిన రీటా.. కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో షెఫ్గా పనిచేస్తున్నారు. దీనితో పాటు- బెట్టీస్ కేక్ టేల్స్ అనే ఓ షాప్ను కూడా నడిపిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం ఈ నెల 9వ తేదీన ఆమె దుబాయ్ అల్ బర్షా ప్రాంతంలో అల్ జహ్రా ఆసుపత్రిలో చేరారు. సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
ఎన్నికల డ్యూటీలో మరో బ్యూటీ!
ఈ నెల 9వ తేదీన బెట్టి హిప్ రీప్లేస్మెంట్ కోసం తమ ఆసుపత్రిలో చేరారని, సర్జరీ అనంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తి, మరణించినట్లు అల్ జహ్రా ఆసుపత్రి ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ మొహయమ్ అబ్దెల్ ఘనీ వెల్లడించారు. రెండు గంటల పాటు సర్జరీ కొనసాగిన తరువాత.. కొన్ని ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తడం వల్ల ఆమె మరణించినట్లు తెలిపారు.
ఈ ఘటనను దుబాయ్ వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. నోటీసులను జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు వెల్లడించారు. రీటా భర్త ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జాయింట్ కమిషనర్ ఇంటర్నేషనల్, దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని దుబాయ్ పోలీసు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా- రీటాకు సర్జరీ చేసిన అల్ జహ్రా ఆసుపత్రి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సమీహ్ తారాబిచిని కూడా మెడికల్ అథారిటీ అధికారులు ప్రశ్నిస్తారని పోలీసులు చెప్పారు. సర్జరీ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబాయ్ హెల్త్ రెగ్యులేషన్ ఛైర్మన్ డాక్టర్ మర్వాన్ అల్ ముల్లా తెలిపారు. విదేశీయులకు వైద్య చికిత్సను అందించే విషయంలో దుబాయ్ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటికి లోబడి సర్జరీలు చేయాల్సి ఉంటుందని హెల్త్ రెగ్యులేషన్ పేర్కొంది. వాటిని ఉల్లంఘించినట్లు విచారణలో తేలితే- భారీ జరిమానాలను విధించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.