హెచ్1 బీ వీసాలు: ఇండియా తర్వాత చైనా, కొత్తగా భారత టెక్కీలకు దక్కని వీసాలు
న్యూఢిల్లీ: 2016 లో హెచ్ 1 బీ వీసాలు పొందిన వారిలో భారత సాంకేతిక నిపుణులు 74.2 శాతం ఉంటే, 2017 నాటికి ఇది 75.6 శాతానికి పెరిగిందని అమెరికాకు చెందిన అధికారుల నివేదిక వెల్లడిస్తోంది. అయితే భారత్ నుండి కొత్తగా హెచ్ 1 బీ వీసాలు పొందే అభ్యర్ధుల సంఖ్య లో మాత్రం తగ్గుదల నమోదైంది.
హెచ్1 బీ వీసాలు పొందిన లబ్దిదారులకు సంబందించిన గణాంకాలను అమెరికా అధికారులు మంగళవారం నాడు విడుదల చేశారు. 2016తో పోలిస్తే 2017లో హెచ్1 బీ వీసాలు పొందిన వారి సంఖ్య పెరిగింది. అయితే కొత్తగా ఇండియా నుండి హెచ్ 1 బీ వీసాలు పొందిన వారి సంఖ్య ఆశించినంత స్థాయిలో లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో హెచ్ 1 బీ వీసాల జారీ విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. దరిమిలా వీసాలు పొందేందుకు ఇండియన్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
74.2 శాతం హెచ్1 బీ వీసాలు ఇండియన్స్కే
2016లో అమెరికా జారీ చేసిన హెచ్ 1 బీ వీసాల్లో ఇండియాకు చెందిన టెక్కీలకు సుమారు 74.2 శాతం దక్కాయి 2017 నాటికి ఈ వీసాలు కొంత పెరిగాయి. సుమారు 75.6 శాతానికి పెరిగినట్టుగా అమెరికా అధికారులు విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.భారత్ నుంచి కొత్తగా హెచ్1-బీ వీసా లబ్దిదారుల సంఖ్యలో మాత్రం తగ్గుదల నమోదైంది.
హెచ్1 బీ వీసాల్లో భారత్ తర్వాతే చైనా
హెచ్1-బీ వీసాల విషయంలో భారత్ తర్వాత చైనా 9 శాతంతో రెండో స్థానంలో ఉంది. 2016లో చైనీయులు 9.3 శాతం హెచ్1బీ వీసాలు పొందారు. 2017లో ఆ తర్వాతి ఏడాదిలో 9.4 శాతం హెచ్ 1 బీ వీసాలను పొందారు.
నివేదికలు ఏం చెబుతున్నాయంటే
2017లో ఆరంభ ఉపాధి కోసం ఆమోదించిన భారత లబ్ధిదారుల సంఖ్య 4.1 శాతం తగ్గింది. అలాగే నిరంతర ఉపాధి కోసం ఆమోదించిన లబ్ధిదారుల సంఖ్య ఇదే ఆర్థిక సంవత్సరంలో 12.5 శాతం పెరిగిందని అమెరికాకు చెందిన యూఎస్సీఐఎస్ సంస్థ వెల్లడించింది. క్యారక్టరిస్టిక్స్ ఆఫ్ హెచ్1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్స్ పేరిట ఈ నివేదికను వెల్లడించారు.
2017 లో ఇండియాకు స్వల్పంగా పెరిగిన వీసాలు
2016లో ఆరంభ ఉపాధి కోసం భారతీయులు 70,375 హెచ్1-బీ వీసాలు పొందారు. అయితే ఏడాది తిరిగే సరికి అంటే 2017నాటికి 67,815కి తగ్గింది. అయితే నిరంతర ఉపాధి కోసం 2016లో 1,85,489 వీసాలు పొందితే ఆ సంఖ్య 2017లో 2,08,608 కుపెరిగింది. మొత్తం 2016లో భారతీయులు 2,56,226 హెచ్1-బీ వీసాలు పొందితే.. ఆ సంఖ్య 2017నాటికి 2,76,423కు చేరిందని అమెరికా అధికారులు విడుదల చేసిన నివేదిక బహిర్గతం చేసింది.