బడా బాబుల గుండెల్లో రైళ్లు: స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు బయటపెట్టనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఇన్ని రోజులు స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు దాచుకున్న వారి వివరాలను వెల్లడిస్తామని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టత ఇచ్చింది. నల్లధనంను వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్న మోడీ సర్కార్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయు ఖాతాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది.
ఇన్కంట్యాక్స్ విధి విధానాలను రూపొందించే సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్... నల్లధనంను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఇందులో భాగంగానే స్విస్ ఖాతాల్లో డబ్బులు దాచుకున్న వారి వివరాలను సెప్టెంబరు నెల నుంచి వెల్లడిస్తామని పేర్కొంది. ఈ ప్రకటనతో అక్కడి ఖాతాల్లో డబ్బులు దాచుకున్న బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారత్ స్విట్జర్లాండ్ల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా భారతీయుల ఖాతాల వివారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఆ బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు సీబీడీటీ తెలిపింది.
2018 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల లావదేవీల వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఆర్థికశాఖ ప్రతినిధి నికోలస్ మారిలో లూషర్ భారత రెవిన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండేకు, సీబీడీటీ ఛైర్మెన్ పీసీ మోడీ, మరియు సీబీడీటీ సభ్యులు అఖిలేష్ రంజన్లతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయుల ఖాతాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇరు దేశాల అధికారులు పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.అంతేకాదు విదేశాల్లో పన్ను విధానాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది.