ఇరాక్లో ఉగ్రఘాతుకం: భారత్ చేరిన 38మంది మృతదేహాలు
Recommended Video
పంజాబ్: ఇరాక్లో అపహరణకు గురై ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 38 మంది భారతీయుల మృతదేహాలను సోమవారం భారత్కు తీసుకువచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మృతదేహాలను పంజాబ్లోని అమృత్సర్కు తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
భారతీయుల మృతదేహాలను భారత్కు తీసుకొచ్చేందుకు ఆదివారం వీకే సింగ్ ఐఏఎఫ్ విమానంలో ఇరాక్లోని మోసుల్ ప్రాంతానికి వెళ్లారు. చనిపోయిన వారిలో 27 మంది పంజాబ్కు చెందిన వారు కాగా, మరో నలుగురు బీహార్ వాసులుగా గుర్తించారు.
ఉపాధి నిమిత్తం ఇరాక్లోని మోసుల్ నగరం వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న ఓ భారతీయుల బృందం 2014లో కిడ్నాప్కు గురైంది. మోసుల్ నుంచి తిరిగి వస్తుండగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అడ్డగించి వీరిని బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.
కాగా, వీరిలో ఒకరైన హర్జిత్ మాసీ అనే వ్యక్తి ఆ మధ్య ఇస్లామిక్ చెర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారు. తనతో పాటు బందీలుగా ఉన్న మిగతావారిని బాదుష్ సమీపంలోని ఎడారిలో చంపేసినట్లు తెలిపారు. అయితే, హర్జిత్ వ్యాఖ్యలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
సరైన ధ్రువీకరణ లేకుండా వారంతా చనిపోయారని భావించడం సరికాదని భావించింది. కాగా, స్థానిక అధికారులు.. గత జులైలో మోసుల్ నగరంలో ఒకేచోట వందల సంఖ్యలో సామూహిక సమాధులు గుర్తించారు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో 39 మంది భారతీయులు చనిపోయినట్లు తేలింది.
విచారణ నిమిత్తం మృతదేహాలను సమాధుల నుంచి వెలికితీసి డీఎన్ఏ పరీక్షలు చేసినట్లు సుష్మాస్వరాజ్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షతో వారు చనిపోయారని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే వీరిని చంపేసినట్లు చెప్పారు. మృతులు పంజాబ్, హిమాచల్ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్కు చెందినవారని వెల్లడించారు. కాగా, పంజాబ్ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు హామీ ఇచ్చారు.