అక్కడ లీటర్ పెట్రోల్కు రూ. 52, మద్యం కూడ రూ.20 తక్కువే, ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి లీటర్ పెట్రోల్ ధర రూ. 76లకు పైగా చేరుకొంది.పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని ప్రజలు పాలకులను కోరుతున్నారు.అయితే అతి తక్కువ ధరకే పెట్రోల్, డీజీల్ దొరుకుతోందంటే అక్కడకు వెళ్ళేందుకు వెనుకాడం. అసోం రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న భూటాన్లో లీటర్ పెట్రోల్ రూ.52లకే లభ్యమౌతోంది. సమీప గ్రామాల ప్రజలు పెట్రోల్ కోసం భూటాన్కు క్యూ కడుతున్నారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నుల కారణంగా పెట్రోల్, డీజీల్లు రోజు రోజుకు వినియోగదారుడికి భారంగా మారుతున్నాయి.
పెట్రోల్, డీజీల్లను కూడ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రాలకు పెట్రోల్, డీజీల్ల నుండి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తోంది కొన్ని రాష్ట్రాలకు ఎక్సైజ్ తర్వాత ఎక్కువ ఆదాయం పెట్రోలియం ఉత్పత్తుల విక్రయంతోనే వస్తోంది.
రూ.52లకే పెట్రోల్ లీటర్
దేశంలో ఎక్కడ చూసినా పెట్రోల్ ధర లీటర్కు సుమారు రూ.70లకు పైనే ఉంది. అయితే భూటాన్ సరిహద్దులో ఉన్న అసోం రాష్ట్ర వాసులకు మాత్రం కొంత తక్కువ ధరకే లభ్యమౌతోంది. అసోంకు సరిహద్దులో ఉన్న భూటాన్లో లీటర్ పెట్రోల్ రూ. 52 మాత్రమే. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భూటాన్ వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొంటున్నారు.భూటాన్లోని సంద్రుప్ జాంగ్ఖర్ అనే పట్టణానికి సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతీయులు క్యూ కడుతున్నారు. రోజుకు కొన్ని వందల మంది పెట్రోల్ కోసం భూటాన్ బాట పడుతున్నారు.
లీటర్ డీజీల్పై రూ.20 తక్కువకే
భూటాన్లో లీటర్ డీజీల్కు రూ.20 తక్కువే లభ్యం కానుంది.అసోం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.76. డీజీల్ ధర కూడ సుమారు రూ.50 లకు పైగా ఉంది. అయితే భూటాన్ లో పెట్రోల్ లీటర్కు రూ. 52లకు, డీజీల్ కు కూడ లీటర్కు ఇండియాలో కంటే రూ.20 తక్కువకే లభ్యమౌతోంది. ఈ విషయం తెలిసిన స్థానికులు భూటాన్ బాట పట్టారు.
మద్యం కూడ అతి తక్కువే
మద్యం కూడ ఇండియా కంటే భూటాన్లో తక్కువగా లభ్యమౌతోంది. మద్యం కూడ ఇండియా కంటే రూ.20 లకు తక్కువగా లభ్యమౌతోంది. పనిలో పనిగా భూటాన్ కు వెళ్ళిన ఇండియన్లు చౌకగా ఇండియాకు మద్యాన్ని తెచ్చుకొంటున్నారు.
ఇండియా కరెన్సీ చలామణి
భూటాన్ కరెన్సీ గుల్ట్రం కూడ భారతీయ కరెన్సీ రూపాయితో సమానంగా ఉంటుంది. అయితే అసోం సరిహద్దులోని భూటాన్ ప్రాంతంలో రూపాయి కూడ చెల్లుబాటు అవుతోంది. రెండు కరెన్సీలను భూటాన్ వాసులు అంగీకరిస్తారు. ఇమ్మిగ్రేషన్ పరంగా కూడా కరెన్సీ చలామణి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు. దీంతో భూటాన్కు అసోం వాసులు క్యూ కడుతున్నారు.