దేశంలో విద్యుత్ రంగానికి భారీ షాక్.. ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు ఏం చెప్తున్నాయి..?
భారతదేశంలో ఆర్థిక మందగమనం తీవ్ర స్థాయిలో ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవలే హెచ్చరించారు. దానికి సంకేతంగా చాలావరకు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం,ఉత్పత్తిని తగ్గించడం కనిపిస్తూనే ఉంది. తినుబండారాల దగ్గరి నుంచి కార్ల వరకు చాలా వస్తువుల విక్రయాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ అథారిటీ(CEA-సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) విడుదల చేసిన డేటా దేశంలో విద్యుత్ రంగం కూడా డీలా పడుతున్నట్టు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ రంగంలో వరుసగా ఐదో నెలలోనూ డిమాండ్ తీవ్రంగా పడిపోయినట్టు సీఈఏ తెలిపింది. అంతేకాదు, గడిచిన ఆరేళ్లలో 2019లో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా నెమ్మదించినట్టు వెల్లడించింది.
ఆర్థిక మందగమనానికి సంకేతం..
విద్యుత్ డిమాండ్ దేశంలో పారిశ్రామిక ఉత్పత్తికి ఒక ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు. అలాంటిది సుదీర్ఘ కాలం విద్యుత్ డిమాండ్ క్షీణిస్తూ వస్తోందంటే.. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్టుగానే చూడాలి. కేంద్ర విద్యుత్ అథారిటీ డేటా ప్రకారం 2019లో దేశంలో విద్యుత్ డిమాండ్ వృద్ది1.1శాతం మాత్రమే నమోదైంది. 2013 తర్వాత దేశంలో ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ పడిపోవడం ఇదే తొలిసారి. 2013 కంటే ముందు విద్యుత్ డిమాండ్లో వృద్ది 8శాతంగా ఉండగా.. ఆ ఏడాది మాత్రం 1శాతానికి పడిపోయింది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు దేశంలో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.
సీఈఏ డేటా
సీఈఏ డేటా ప్రకారం.. గతేడాది నవంబర్లో విద్యుత్ డిమాండ్ 4.2 శాతం, అక్టోబర్లో 12.8 శాతం మేర పడిపోయింది. గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్టోబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 13.2శాతం పడిపోయింది. ఈ గణాంకాలన్నీ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న భారత ఆర్థిక మందగమనాన్ని సూచిస్తున్నాయి. అదే సమయంలో పారిశ్రామికీకరణలో ముందు వరసలో ఉన్న మహారాష్ట్ర,గుజరాత్లలో మాత్రం విద్యుత్ డిమాండ్ పెరిగినట్టు గణాంకాలు చెబుతుండటం గమనార్హం.
విద్యుత్ సంస్థలకు దెబ్బ
దేశ వార్షిక విద్యుత్ వినియోగంలో ఐదు వంతుల్లో రెండు వంతుల కంటే ఎక్కువ పారిశ్రామిక రంగమే ఉపయోగించుకుంటోంది. ఆర్థిక మందగమనం కారణంతో చాలావరకు పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ డిమాండ్ పడిపోయింది. ఇప్పటికే 11బిలియన్ డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇదో పెద్ద దెబ్బ.
పడిపోతున్న జీడీపీ
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో దేశ జీడీపి 4.5 శాతానికి పడిపోయింది. 2013 తర్వాత అటు వినిమయ డిమాండ్,ఇటు ప్రైవేట్ పెట్టుబడులు పడిపోవడం ఇదే తొలిసారి. ప్రభుత్వ అంచనా ప్రకారం.. 2008 ప్రపంచ సంక్షోభం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సవరంలోనే జీడీపీ వృద్ది రేటు అత్యంతగా క్షీణించింది.