వ్యాక్సిన్ వస్తే గానీ: వరుసగా 90 వేలకుపైగా: 10 రాష్ట్రాలు కకావికలం: అంచనాలు పటాపంచలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుతుందనే అనుమానాలు ఇక అడగంటిపోయినట్టే. రోజులు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత రెట్టింపు అవుతోందే తప్ప.. ఏ మాత్రం క్షీణించట్లేదు. పైగా వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులతో మరింత బలోపేతమౌతోందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కరోనాను మట్టుబెట్టడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఒక్కటే మిగిలివుంది.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1133 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 54,00,620కి చేరుకుంది. ఇప్పటిదాకా 86,752 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 10,10,824కు చేరుకుంది. 43,03,044 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రాల్లో అనూహ్య సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ పరీక్షల జోరు కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి శనివారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య ఆరున్నర కోట్లకు చేరువైంది. ఇప్పటిదాకా 6,36,61,060 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. గురువారం ఒక్కరోజులో 12,06,806 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. దేశం మొత్తం మీద 10 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.
Recommended Video
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి అధికంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో వేలకొద్దీ రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. అల్లకల్లోలానికి గురి చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ఈ నెల 23వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అవుతున్నారు.