మంటలు రేపుతోన్న వ్యవసాయ బిల్లులపై మోడీ మనసులో మాట ఇదే: గురునానక్ కృప కటాక్షాలతో
న్యూఢిల్లీ: దేశ వారసత్వ చరిత్రను ప్రతిబింబించే ప్రాచీన విగ్రహాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దీనికోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. వారణాశిలో చోరీకి గురైన అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్ని తిరిగి రప్పిస్తున్నామని తెలిపారు. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మోడీ ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రాచీన వారసత్వ సంపదతో పాటు ప్రకృతిని కాపాడుకోవడాన్ని ప్రతి భారతీయుడు తన బాధ్యతగా గుర్తించాలని చెప్పారు.
Recommended Video
న్యూజీలాండ్ పార్లమెంట్లో సంస్కృతం..
న్యూజీలాండ్లో కొత్తగా ఆ దేశ పార్లమెంట్కు ఎంపికైన ఎంపీ డాక్టర్ గౌరవ్ శర్మ.. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారని, అది గర్వకారణమని అన్నారు. గురు నానక్ జయంతిని సోమవారం జరుపుకోనున్నామని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని చెప్పారు. 2001లో గుజరాత్లోని కఛ్లో సంభవించిన భూకంపానికి ప్రాచీన గురుద్వారా ద్వంసమైందని, దాన్ని పునరుద్ధరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గురునానక్ స్వయంగా ఈ గురుద్వారాలో సేద తీరినట్లు చరిత్ర చెబుతోందని అన్నారు. గురునానక్ ఆశీర్వాద బలంతో కర్తార్పూర్ కారిడార్ ప్రాజెక్టును పూర్తి చేశామని గుర్తు చేశారు.
బ్రెజిల్లో విశ్వనాథుడు..
బ్రెజిల్కు చెందిన మెకానికల్ ఇంజినీర్ జొనాస్ మఛెట్టి.. భారత సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. వేదాంతాలు, భగవద్గీత గొప్పతనాన్ని ఆయన బ్రెజిల్లో ప్రచారం చేస్తున్నారని, ఆయనను అందరూ విశ్వనాథ్గా పిలుస్తారని చెప్పారు. స్టాక్ మార్కెట్ కంపెనీలో చేరిన ఆయన భారతీయ సంస్కృతి పరిశోధనలు చేశారని, తమిళనాడులోని కోయంబత్తూర్ వద్ద గల అర్శ వైద్య గురుకులంలో నాలుగేళ్ల పాటు వేదాంతాన్ని అభ్యసించారని మోడీ చెప్పారు.
గురునానక్ సూక్తుల ఆధారంగా..
రైతాంగానికి మేలు కలిగించేలా తమ ప్రభుత్వం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ చట్టాల వల్ల రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. రైతులు గురునానక్ జయంత్యుత్సవాల వేడుకలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సేవా కార్యక్రమాలు, అందరి ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో లంగర్ వ్యవస్థను ప్రారంభించారని అన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకున్నామని మోడీ పేర్కొన్నారు. రైతులకు ఈ చట్టాల వల్ల కొత్త హక్కులు సమకూరుతాయని, వినూత్న అవకాశాలను వారికి తెచ్చిపెడుతుందని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వద్దు..
ప్రాణాంతక కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ప్రధాని సూచించారు. అన్లాక్ తరువాత ప్రజల్లో వైరస్ పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి వ్యాక్సిన్లు తయారవుతున్నాయని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని అన్నారు. కరోనా వైరస్పై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని మోడీ తెలిపారు.