కరోనా విలయం: భారత్ కీలక అడుగు.. తొలి స్వదేశీ టెస్టింగ్ కిట్.. కేంద్రం కీలక ప్రకటనలు..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో లాక్డౌన్ గడువును మరోసారి పొడిగించే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తున్న సమయంలోనే ఓ శుభవార్త వెల్లడైంది. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు తొలిసారి స్వదేశీ టెస్టింగ్ కిట్ను విజయవంతంగా రూపొందించారు. వైరస్ కట్టడికి టెస్టులే కీలకం కావడంతో.. కిట్స్ కోసం మనం ఇన్నాళ్లు చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలపై ఆధారపడుతూ వచ్చాం. ఇప్పుడు దేశీ కిట్స్ అందుబాటులోకి రానుండటంతో కరోనా కట్టడి చర్యలు మరింత వేగవంతం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పుణె వైరాలజీ ల్యాబ్ సిబ్బందిని అభినందించారు.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 64 వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2వేలు దాటింది. కాగా, మిగతా దేశాల కంటే మన దగ్గర రికవరీ రేటు గరిష్టంగా 30 శాతంగా ఉందని, ఇప్పటికే సుమారు 20 వేల మంది వ్యాధి నుంచి కోలుకున్నారని ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ గుర్తుచేశారు. గడిచిన 24 గంటల్లో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కొవిడ్-19 కట్టడికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని, ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే 72 లక్షల ఎన్-95 మాస్కులు, 36 లక్షల పీపీఈ కిట్స్ను అందజేశామని తెలిపారు.
ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2వేల పైచిలుకు కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో మాత్రం పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతున్నది. తమిళనాడులో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 669 కేసులు వచ్చాయి. అందులో మెజార్టీ కేసులు చెన్నై సిటీలోనే నమోదయ్యాయి. మొత్తంగా తమిళనాడులో కేసుల సంఖ్య 7,204గా ఉంది. ఢిల్లీలో ఆదివారం కొత్తగా 381 కేసులు రావడంతో మొత్తం సంఖ్య 7వేలకు చేరువైంది.
Recommended Video
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 875 కేసులు, 19 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ముంబై సిటీలో కేసుల సంఖ్య 13,564కు, మరణాలు 508కి పెరిగినట్లయింది. మహారాష్ట్ర మొత్తం కలిపి కేసుల సంఖ్య 21వేలకు చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం 50 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 2వేలకు చేరువైంది. తెలంగాణలో కొత్తగా33 కేసులు రావడంతో టోటల్ సంఖ్య 12వందలకు దగ్గరైంది. ఈ దశలో లాక్ డౌన్ పొడగించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.