ఇండిగో విమానాయాన సంస్థ సర్వర్లు డౌన్...ఇబ్బందుల్లో ప్రయాణికులు
ముంబై: దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో ఆయా విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కౌంటర్ల దగ్గర కొన్ని గంటలుగా వేచిచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లోని ఇండిగో టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. అయితే సర్వర్లు డౌన్ అయ్యేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇండిగో విమానం నిర్వాకం: మొత్తంప్రయాణికుల లగేజీని మరిచి దేశం దాటింది
సోమవారం ఉదయం నుంచి ఇండిగో సర్వర్లలో సాంకేతికలోపం తలెత్తిందని ఇండిగో యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ప్రకటన ద్వారా తెలిపింది. సర్వర్లను వీలైనంత తర్వలో మరమత్తులు చేసి పునరుద్ధరిస్తామని ప్రకటనలో తెలిపింది. చెన్నైలో, గురుగ్రామ్, పూణేలలో సర్వర్లు డౌన్ అయ్యాయని ఒక అధికార ప్రతినిధి తెలిపారు. ఫోన్ల ద్వారా ప్రయాణికులకు సమాచారం చేరవేస్తున్నట్లు చెప్పారు. అయితే ఒక సాఫ్ట్వేర్లో మాత్రమే సాంకేతిక సమస్య తలెత్తిందని ప్రయాణికులు వెబ్సైట్ ద్వారా టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
ఉదయం 9:40 గంటల వరకు విమానాలు షెడ్యూల్ ప్రకారమే నడిచాయని కొచ్చి విమానాశ్రయంలోని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం సిస్టం స్లో అయ్యిందని పేర్కొన్నారు. మరి కొంత సమయంలో తిరిగి సర్వర్లు పనిచేస్తాయని చెప్పారు. అయితే ఏమి జరిగినా కొచ్చి నుంచి తదుపరి విమానం సాయంత్రం 5:40 గంటలకు ఉందని వెల్లడించారు. ఇక బెంగళూరులో కూడా సర్వర్లు డౌన్ అయ్యాయి. కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన బెంగళూరు - మంగళూరు-చెన్నై విమానం రద్దు అయినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు.
కన్నూరు నుంచి చెన్నైకు వెళ్లాల్సిన విమానం లేట్ అయ్యిందని చెప్పారు కన్నూరు ఇండిగో ప్రతినిధి. సర్వర్లు డౌన్ అయ్యాయని అయితే అవి ఎప్పుడు తిరిగి అందుబాటులోకి వస్తాయో తనకు ఐడియా లేదని అధికారి చెప్పారు. బెంగళూరు, హుబ్లీ, కొచ్చిన్, హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు విమానాశ్రయం పార్కింగ్లో నిలిచిపోయినట్లు అధికారి చెప్పారు. అయితే ఇవి ఎప్పుడు తిరిగి బయలుదేరుతాయో ఇంకా షెడ్యూల్ చేయలేదని చెప్పారు.