కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా: ఇండిగో ఎయిర్లైన్స్ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 28 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లను వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ను వినియోగిస్తోన్నారు. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి పలు దేశాలు ఆపర్లను ప్రకటించాయి.
వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీర్లు ఫ్రీ అంటూ ప్రకటించిన దేశాలు చాలా ఉన్నాయి. తాజాగా- ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. కరోనా టీకా తీసుకున్న ప్రయాణికుల కోసం దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. ఆకర్షణీయమైన ఆఫర్ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రయాణ రాయితీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఛార్జీలో 10 శాతం మేర డిస్కౌంట్ ఇస్తామని వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో హెల్త్ వర్కర్లు ఇచ్చే సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. రెండు డోసులు మాత్రమే కాదు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. ఈ మేరకు ఇండిగో విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు తమ టికెట్ను బుక్ చేసుకునే సమయంలో వ్యాలిడ్ కోవిడ్19 వ్యాక్సిన్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
Recommended Video
ఆరోగ్య సేతు యాప్లో రికార్డయిన తమ వ్యాక్సిన్ స్టేటస్ను చూపించడానికి ఉద్దేశించిన వివరాలను విమానాశ్రయం చెక్ ఇన్ కౌంటర్/బోర్డింగ్ గేట్ వద్ద కూడా చూపించి.. ప్రయాణ రాయితీని పొందవచ్చని ఇండిగో ఎయిర్లైన్స్ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోందని, ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని ఇండిగో ఎయిర్లైన్స్ చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ అధికారి సంజయ కుమార్ తెలిపారు.