విమానంలో దోమలున్నాయంటే.. దాడి చేసి, వైద్యుడ్ని బలవంతంగా దించేశారు
Recommended Video
బెంగళూరు: దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది మరోసారి వివాదాస్పద వైఖరితో వార్తల్లోకి ఎక్కారు. విమానంలో దోమలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ఓ ప్రయాణికుడిపై దాడి చేసి, గెంటివేశారు సిబ్బంది. ఈ ఘటన లక్నో నుంచి బెంగళూరు వెళుతున్న 6ఈ 541 సర్వీసులో జరిగింది.
సౌరబ్ రాయ్ అనే వైద్యుడు విమానం ఎక్కిన తరువాత, విమానంలో దోమలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. సిబ్బంది పట్టించుకోక పోవడంతో, ఇతర ప్రయాణికులకు విషయం చెప్పి నిలదీద్దామని అన్నాడు. దీంతో ఆగ్రహించిన విమానం సిబ్బంది బయటి నుంచి సెక్యూరిటీని పిలిచి అతడిని బలవంతంగా విమానం నుంచి దించేయించారు.
జరిగిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తగా.. వివరణ ఇచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్. సదరు ప్రయాణికుడు సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు దూషించాడని, విమానాన్ని హైజాగ్ చేస్తానని హెచ్చరించడంతో పాటు, కుర్చీలను విరిచేయాలని, విమానాన్ని ధ్వంసం చేయాలని ఇతర ప్రయాణికులను ఉసిగొల్పుతున్నందునే దించి వేశామని చెప్పడం గమనార్హం.
ఏది ఏమైనా సుమిత్ కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం.. విమానంలో ప్రయాణికులు లేని సమయంలోనే దోమల మందును ప్రయోగిస్తామని చెప్పింది. కాగా, తనకు జరిగిన అవమానాన్ని డాక్టర్ సౌరబ్ రాయ్ మీడియాకు తెలిపారు. దోమలున్నాయన్నందుకు తనను ఉగ్రవాదితో పోల్చి దాడి చేసి, విమానం నుంచి బలవంతంగా దించేశారని ఆరోపించారు. గతంలోనూ ఇండిగో సిబ్బంది ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలకు పాల్పడటం గమనార్హం.