ఇండిగో విమానంలో సాంకేతిక లోపం...కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం
నాగ్పూర్: లోబడ్జెట్ దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్ గ్రహించాడు. టేకాఫ్ తీసుకోవడంలో విమానం విఫలమవడంతో మళ్లీ ప్రయత్నించాడు పైలట్. అయినప్పటికీ విమానం టేకాఫ్ తీసుకోకపోవడంతో విమానంను ఎయిర్పోర్టులోనే నిలిపివేశాడు.
నాగ్పూర్లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం 6E-636 ఉదయం 7:50 గంటలకు టేకాఫ్ తీసుకుని ఢిల్లీకి 9:35 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు మరో 158 మంది ప్రయాణికులు ఉన్నారు. టెక్నికల్ ఫాల్ట్ రావడంతోనే విమానం నిలిచిపోయిందని విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ విజయ్ ములేకర్ తెలిపారు.
ఇక మరమత్తులు అయ్యాక ఉదయం 10:30 గంటలకు మరోసారి విమానంను టేకాఫ్ చేసే ప్రయత్నం పైలట్ చేశాడు. అయితే రెండో సారి కూడా విఫలమైంది. అయితే రన్వేపై వెళ్లిన విమానం తిరిగి పార్కింగ్ ప్లేస్కు చేరుకుంది. విమానంలో ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగో విమానాల్లో ఈ మధ్యకాలంలో సాంకేతిక సమస్యలు చాలా ఎక్కువయ్యాయి.
గత నెలలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇలాంటి పరిస్థితే కనిపించింది. పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే గాల్లో చక్కర్లు కొట్టింది. అటు ముందుకు పోలేక.. ఇటు కిందకు దిగలేక అలా చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణీకులు టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు.ఆ విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో పైలట్ అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు కిందకు దించే వీలులేకపోవడంతో అలా కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. చివరకు అంతా ఓకే అనుకున్న తర్వాత తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ చేశారు. మొత్తానికి సేఫ్గా విమానం కిందకు దిగడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.