రూ.999కే టికెట్: 10లక్షల సీట్లతో ఇండిగో భారీ ఆఫర్, అదే దారిలో గోఎయిర్, ఎయిర్ఏషియా
ముంబై: విమానయాన సంస్థలు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వచ్చాయి. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా భారీ ఆఫర్ను ప్రకటించింది. దాదాపు 10లక్షల విమాన టికెట్లను అమ్మే లక్ష్యంతో రూ.999ల అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలు ప్రారంభించింది.
20శాతం క్యాష్బ్యాక్
మొబైల్ వాలెట్ మొబిక్విక్ నుంచి దాదాపు రూ.600 వరకూ 20శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 2019 మార్చి 30 మధ్య గడువులో ప్రయాణించేందుకు గానూ రూపొందించిన ‘ఫెస్టివల్ సేల్'ను సోమవారం నుంచి ప్రారంభించింది.
నాలుగు రోజులపాటు
నాలుగురోజులపాటు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఇండిగో కంపెనీ వెల్లడించింది. అతి తక్కువ ధరలోనే విమాన టికెట్లను అందిస్తున్న కారణంగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నట్లు ఇండిగో ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్డర్ తెలిపారు. దస్తు టికెట్ల అమ్మకాలతో మరిన్ని లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఎయిర్ఏషియా ఆఫర్లు
ఇతర విమానయాన సంస్థలు కూడా ఇండిగో దారిలోనే వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించాయి. ఎయిర్ఏషియా ఇండియా సంస్థ దేశీయ మార్గాల్లో రూ.999 ప్రారంభ ధరతో టికెట్లను అందిస్తున్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో రూ.1,399 ప్రారంభ ధరతో టికెట్లను అందిస్తున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 8రోజులపాటు బుకింగ్ చేసుకోవచ్చు. 19 ఫిబ్రవరి 2019 నుంచి 26 నవంబర్ 2019 మధ్య కాలంలో ప్రయాణాలకు మాత్రమే ఈ బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదే దారిలో గోయిర్ కూడా
గోఎయిర్ కూడా రూ.1,099 ప్రారంభ ధరతో టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కోసం సెప్టెంబర్ 3 నుంచి మార్చి 31 మార్చి 2019 వరకు ప్రయాణం చేసేందుకు సెప్టెంబర్ 3 నుంచి మూడు రోజులపాటు బుకింగ్స్ చేసుకోవచ్చు.