ఇంజన్లో సమస్య.. 65 విమానాలు రద్దు, ఇబ్బందుల్లో ప్రయాణికులు
ముంబై: ఒకటా రెండా.. వివిధ నగరాలకు వెళ్లాల్సిన 65 విమానాలు ఒక్కసారే రద్దయ్యాయి. బడ్జెట్ క్యారియర్లైన ఇండిగో 47 విమానాలను రద్దు చేస్తే.. గోఎయిర్ 18 విమానాలను రద్దు చేసింది.
ఏ 320 నియో విమానాల ఇంజన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, కాబట్టి వాటిని అత్యవసరంగా నిలిపివేయాలని మంగళవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించడంతో రెండు విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతి తదితర నగరాలకు వెళ్లాల్సిన ఆ రెండు సంస్థల విమానాలు అర్ధంతరంగా రద్దయ్యాయి.
దీంతో వివిధ నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో విమానం.. గాల్లోకి లేచిన 40 నిముషాల్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తి మధ్యలోనే దించేయడంతోనే డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది.
భద్రతా కారణాలు దృష్ట్యానే పీడబ్ల్యూ1100 ఇంజన్లు కలిగిన ఏ320 నియో విమానాలను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు డీజీసీఏ ప్రకటించింది. డీజీసీఏ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తమ విమానాలను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.
అయితే, విమానాల రద్దు వల్ల తమ ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగిన మాట వాస్తవమేనని, దానిని భర్తీ చేసేందుకు అదే నగరాలకు వెళ్లే తమ వేరే విమానాల్లో వారిని గమ్యస్థానాలకు చేరుస్తామని సంస్థ ప్రకటించింది.