ఇండిగో సిబ్బంది పైశాచికం: ప్రయాణికుడిపై కిందపడేసి దాడి(వీడియో)
Recommended Video
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో ప్రయాణికుల పట్ల విమాన, విమానాశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విమానాశ్రయాలో ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది పైశాచికం బయటపడింది.
ఢిల్లీలో కలకలం
తాజాగా, ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బహిర్గతమవడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ప్రయాణికుడి పట్ల అమర్యాదగా..
రాజీవ్ కటియాల్ అనే ప్రయాణికుడు అక్టోబరు 15న ఇండిగో విమానంలో న్యూఢిల్లీ వెళ్ళారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన టార్మాక్ వద్ద ఉన్న బస్సుల వద్దకు వెళ్ళారు. అక్కడ తీవ్రమైన ఎండ వేడి ఉండటంతో సమీపంలోని చెట్టువద్ద నిల్చున్నారు. ఆయన నో ఎంట్రీ జోన్లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆయనతో దురుసుగా మాట్లాడారు.
బస్సు ఎక్కకుండా అడ్డుకుని..
రాజీవ్.. వారితో ‘మీ పని మీరు చూసుకోండి' అని అన్నారు. ఆ తర్వాత రాజీవ్.. బస్సు వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా, టార్మాక్ సిబ్బంది నిర్దయగా ఆయనను వెనుకకు లాగేశారు.
కిందపడేసి దాడి..
రాజీవ్ వారి పట్టును వదిలించుకునేందుకు ప్రయత్నించగా, ఆ ఇద్దరూ ఆయనను కింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. కొంతసేపటి తర్వాత ఆయనను మరొకరు వచ్చి విడిపించారు. ఆయనను కొడుతున్న సమయంలో ఆ ఇద్దరు సిబ్బంది చాలా సంతోషంగా, నవ్వుతూ కనిపించడం గమనార్హం. ఈ వ్యవహారంపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్గా మారింది. దీంతో దిగి వచ్చిన ఇండిగో యాజమాన్యం క్షమాపణ చెప్పింది. దాడికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది.