ఇక ప్రతీ విమానంలో రెండు దోమల బ్యాట్లు: ఇండిగో నిర్ణయం..
న్యూఢిల్లీ: విమానాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టింది ఇండిగో ఎయిర్లైన్. ఇందులో భాగంగా విమానాల్లో దోమల బ్యాట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విమానాల్లో ఎలక్ట్రికల్ బ్యాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
విమానంలో దోమల బెడదపై ఇటీవల ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన ఎఫెక్ట్ తో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది ఇండిగో ఎయిర్ లైన్స్. దోమలున్నాయని ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రయాణికుడిని దించేయడంతో ఇండిగో వివాదంలోనూ ఇరుక్కుంది.
కాగా, దోమల నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో విమానంలో 2 ఎలక్ట్రికల్ బ్యాట్లను ఉంచనున్నట్టు సమాచారం. నిర్ణీత సమయం ప్రకారం కేబిన్ సిబ్బంది వీటిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. అయితే విమానంలో ఇంధనాన్ని నింపేటప్పుడు మాత్రం వీటిని ఉపయోగించబోరని ఓ అధికారి తెలిపారు.
దోమల బెడదపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, ఆ కారణంగా విమానాలు ఆలస్యమైన ఘటనలు కూడా ఉండటంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇండిగో అధికారి ప్రతినిధి దీనిపై స్పందించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎలక్ట్రిక్ బ్యాట్లను ఉపయోగిస్తామని అన్నారు. కాగా, కోల్కతా, లక్నో, వారణాసి లాంటి ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.