రూ.899కే విమాన టికెట్లు: ఇండిగో దీపావళి ఆఫర్, కానీ, షరతులు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: దీపావళి పండగను పురస్కరించుకుని దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి స్పెషల్ సేల్ పేరుతో ప్రారంభ ధర రూ.899 టికెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
మూడు రోజులపాటు..
మూడు రోజులపాటు అందించే ఈ ఆఫర్ కింద 10లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో తెలిపింది. అక్టోబర్ 24-26 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రారంభ ధర రూ.899కే టికెట్. నవంబర్ 8, 2018, ఏప్రిల్ 15, 2019 వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణాలు చేయొచ్చని పేర్కొంది.
64మార్గాల్లోనే..
మూడురోజులపాటు ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరకే టికెట్లు అందిస్తున్నామని ఇండిగో తెలిపింది. ఇండిగో ప్రయాణించే 64 గమ్యస్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
నాన్ స్టాప్ మార్గాల్లోనే..
తమ కుటుంబసభ్యులను, స్నేహితులను కలుసుకుని వారితో దీపావళి పండగను జరుపుకునేందుకే ఈ ఫెస్టివల్ ఆఫర్ తీసుకొచ్చినట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తెలిపారు. ఎయిర్పోర్టు ఛార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండబోదని వెల్లడించారు. దేశీయ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
నగదు తిరిగి ఇవ్వడం జరగదు
ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లు రద్దు చేసుకుంటే నగదు తిరిగి ఇవ్వడం జరగదని సదరు అధికారి తెలిపారు. ఇండిగో వెబ్సైట్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. తాము అందిస్తున్న ఈ ఆఫర్ విమానయాన సంస్థల మధ్య పోటీని పెంచుతుందని చెప్పారు. కాగా, ఇండిగో ఆఫర్ ప్రకటించింది గానీ.. తక్కువ ధరకు టికెట్లు అందుబాటులో ఉంచలేదని ఇండిగో వెబ్సైట్ సందర్శించిన కస్టమర్లు వాపోతున్నారు.