కునాల్ కామ్రా నిషేధంలో కొత్త ట్విస్ట్: సీన్లోకి పైలట్, తనను సంప్రదించకుండా ఎలా చర్యలని లేఖ..
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గో స్వామితో అసభ్యంగా ప్రవర్తించినందుకు కమెడీయన్ కునాల్ కామ్రాపై ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఆరునెలలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను ఎందుకు బ్యాన్ చేయరని ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఇండిగో ఫైలట్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనను సంప్రదించకుండా కునాల్ కామ్రా ఎలా బ్యాన్ విధిస్తారని సంస్థకు రాసిన లేఖలో అడిగారు. దీంతో ఇండిగో చర్య ఏకపక్షమేనా అనే అనుమానం తలెత్తుతోంది.
అడగాలి కదా..
కునాల్ కామ్రాపై నిషేధం పైలట్ స్పందిస్తూ.. ఎయిర్లైన్స్ విధించిన సస్పెన్షన్ గురించి తెలిసి షాక్నకు గురయ్యానని పేర్కొన్నారు. మంగళవారం ముంబై-లక్నో వెళ్తున్న విమానంలో ఏం జరిగిందనే అంశంపై యాజమాన్యం తనను ఆరాతీయలేదని గుర్తుచేశారు. కానీ కామ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆధారంగా ఏకపక్షంగా చర్యలు తీసుకుందని చెప్పారు. వాస్తవానికి ఏదైనా ఘటన జరిగితే పైలట్ అభిప్రాయం తీసుకొని చర్యలు తీసుకుంటారు.. కానీ కునాల్ విషయంలో మేనేజ్మెంట్ మాత్రమే స్పందించింది. తొమ్మిదేళ్ల కెరీర్లో ఇలాంటి ఘటన చూడలేదని లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
లెవల్-1 కాదు కదా..
వాస్తవానికి విమానంలో కునాల్ కామ్రా అనుచితంగా ప్రవర్తించారు. కానీ అతని ప్రవర్తన లెవల్ 1 ప్రయాణికుడి మాదిరిగా మాత్రం లేదు అని స్పష్టంచేశారు. అంత అసభ్యకరంగా ప్రవర్తించలేదని చెప్పారు. కునాల్ కామ్రాపై నిషేధం మాత్రం అంతుపట్టడం లేదని, అనుచితంగా ప్రవర్తించకున్నా.. హై ప్రొఫైల్ కేసు కాబట్టి చర్యలు తీసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం ఘటనపై తాము అంతర్గత కమిటీ వేశామని.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని పీటీఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.
మరో 3 సంస్థలు..
ఇండిగో సంస్థ నిషేధం విధించిన తర్వాత.. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్ కూడా తమ విమానాల్లో కునాల్ కామ్రాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇండిగో మాదిరిగా ఇతర విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఒక్కో సంస్థ నిషేధం విధించింది. నిషేధంపై విమర్శలు వెల్లువెత్తడంతో డీజీసీఏ కూడా స్పందించింది. కునాల్ కామ్రాపై నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని, ఓ వ్యక్తిపై కావాలని చర్యలు తీసుకోబోమని స్పష్టంచేశారు.
ఇవీ నిబంధనలు
కానీ వాస్తవానికి విమానంలో అసభ్య ప్రవర్తనకు సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. అంతర్గత కమిటీ నెలరోజుల్లో విచారణ పూర్తి చేసి.. నివేదిక అందజేయాలి. అలా అందించిన రిపోర్ట్ ఆధారంగా విమానయాన శాఖ చర్యలకు ఉపక్రమిస్తోంది. అదీ కూడా 30 రోజులు మాత్రమే నిషేధం విధించొచ్చు. దానిని విమానయాన శాఖ, కోర్టులో ప్రతివాది అప్పీల్ చేసే అవకాశం ఉంది.