సీక్రెట్ రివీల్డ్: అప్పటి పాక్ ప్రధానికి ఇందిరా ఇచ్చిన ఆఫర్ ఏమిటి..?
ఇస్లామాబాదు: కశ్మీర్ పరిణామాలపై పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1971 భారత్ పాక్ యుద్ధం తర్వాత అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. పాక్ సంయుక్త పార్లమెంటు సమావేశంలో ప్రసంగించిన జర్దారీ మరిన్ని ఆసక్తికర విషయాలపై మాట్లాడారు.
1971లో యుద్ధం తర్వాత ఖైదీలుగా 90వేల మంది పాక్ సైనికులు
1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత అప్పటి పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీతో చర్చలు జరిగిన తర్వాత కొంత భూభాగాన్ని తీసుకోవడం జరిగిందని ఆమేరకు ఒప్పందం కూడా కుదిరిందని ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పారు. ఆ సమయంలో భారత్ అధీనంలో పాక్కు చెందిన 90వేల మంది ఖైదీలు ఉన్నారని గుర్తుచేశారు. పాకిస్తాన్లో ఇప్పుడున్న పంజాబ్ ప్రావిన్స్ చాలా రహస్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను తిరిగి తెప్పించే క్రమంలో జుల్ఫికర్ భుట్టోపై ఒత్తిడి వచ్చిందని చెప్పారు. ఇందిరా గాంధీకి భుట్టో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిందని ఆ సమయంలో ఆమె భుట్టోతో ఒక డీల్కు వచ్చారని సభలో జర్దారీ చెప్పారు.
ఇందిరా గాంధీ కుదుర్చుకున్న డీల్..?
నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ జుల్ఫికర్ అలీ భుట్టోకు ఆఫర్ ఇచ్చిందని చెప్పిన జర్దారీ...పాక్ యుద్ధ ఖైదీలను విడుదల చేయాలా లేక భూమిని తిరిగి ఇచ్చేస్తారా అనే డీల్ ముందుంచినట్లు జర్దారీ చెప్పారు. అప్పటికే విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ పాక్ భూభాగాన్ని వదలుకోలేదని... జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఎలాగూ వారిని భారత్ విడుదల చేస్తుందన్న బలమైన నమ్మకంతో భూభాగమే కోరుకున్నాడని సభలో చెప్పారు. అందుకే నాడు భుట్టో తీసుకున్న నిర్ణయంకు సెల్యూట్ చేస్తున్నట్లు జర్దారీ చెప్పారు.
1971 యుద్ధం జరిగిన తర్వాత షిమ్లా ఒప్పందం
ఇప్పుడున్నంత బలంగా నాడు భారత ఆర్థిక వ్యవస్థ లేదని గ్రహించిన భుట్టో 90వేల మందిని భారత్ భరించలేదని వూహించి భూమిని వదులుకునేందుకు ఒప్పుకోలేదని చెప్పారు. ఇదిలా ఉంటే 1971లో 13 రోజుల పాటు భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగింది. డిసెంబర్ 16, 1971లో యుద్ధం ముగిసింది. 1972లో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. ఆ సమయంలో యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేసేందుకు ఇందిరాగాంధీ ఒప్పుకున్నారు.