ముందస్తు వ్యూహంతోనే గాల్వాన్ దాడి: చైనా పాక్ కలిసి కుట్ర.. అమెరికా షాకింగ్ నిజాలు
న్యూఢిల్లీ: భారత్ చైనా బలగాల మధ్య గాల్వాన్ వ్యాలీలో జూన్లో జరిగిన ఘర్షణ చైనా ముందస్తు వ్యూహంలో భాగమేనా.. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదా..? డ్రాగన్ కంట్రీ భారత బలగాలపై దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసిందా ..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇవన్నీ చైనా ముందస్తు వ్యూహంతోనే చేసిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ముందస్తు వ్యూహంతోనే చైనా దాడి
జూన్ నెలలో భారత్ చైనా బలగాల మధ్య గాల్వాన్ వ్యాలీలో ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబుతో సహా మొత్తం 20 మంది జవాన్లు అమరులయ్యారు. అయితే చైనా సైనికులు కూడా ఈ ఘటనలో మృత్యువాత పడినప్పటికీ ఆ దేశం మాత్రం బహిరంగంగా ప్రకటించలేదు. అయితే తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం డ్రాగన్ కంట్రీ పక్కా ప్లాన్తోనే భారత్పై దాడి చేసిందని చెబుతున్నాయి. గాల్వాన్ ఫింగర్ 4 మరియు హాట్ స్ప్రింగ్ ప్రాంతాల్లో చొరబడేందుకు చైనా పక్కా ప్లాన్ రచించిందని ఇటు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు భారత్ భద్రతాదళాలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ కూడా చైనాకు భారత ఆర్మీ వ్యవస్థ గురించి సమాచారం ఇస్తోందని తెలుస్తోంది. దాడికి ముందే ఆ ప్రాంతాల్లో చైనా కొన్ని అత్యాధునిక ఆయుధాలను అక్కడ ఉంచిందని సమాచారం.
ఎప్పటినుంచో అక్కడ చైనా ఆయుధాలు
ఇదిలా ఉంటే టిబెట్కు సమీపంలో చైనా గతేడాదే కొన్ని యుద్ధ ట్యాంకులను మోహరించిందని అప్పుడే కొన్ని వార్తలు వార్తపత్రికల్లో వచ్చాయి. అయితే ఎల్ఏసీ వద్ద చొరబడటంపై చైనా స్పష్టమైన వైఖరితో ఉందని సమాచారం. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతోనే చైనా భారత బలగాలపై దాడికి దిగిందని సమాచారం. T-15 ట్యాంకు 30 టన్నులు ఉండగా అందులో 105 ఎంఎం గన్ అమర్చి ఉంటుంది. దీంతో పర్వతప్రాంతాల్లో దీని వినియోగం సులభంగా ఉంటుంది. అంతేకాదు హెలికాఫ్టర్ ద్వారా ఈ ట్యాంకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా రవాణా చేయొచ్చు. అయితే ఇది సమాచారం మాత్రం అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు.
చైనాకు ధీటుగా భారత్ కూడా తన ఆయుధాలు..
ఇదిలా ఉంటే భారత భద్రతా ఏజెన్సీల ప్రకారం భారత ఆర్మీ T-90 యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించి ఉన్నట్లు సమాచారం. చైనా తమ యుద్ధ ట్యాంకులను మోహరించిందన్న సమాచారం అందడంతోనే భారత్ కూడా వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ ట్యాంకులను మోహరించినట్లు తెలుస్తోంది. అయితే రక్షణ రంగ నిపుణుల ప్రకారం చైనాకు చెందిన T-15 ట్యాంకులు బరువు తక్కువగా ఉండటంతో ఒకచోట నుంచి మరో చోటుకు సులభంగా తరలించే అవకాశం ఉండగా.. భారత్కు చెందిన T-90 యుద్ధ ట్యాంకులు అధిక బరువు ఉండటంతో వాటిని తరలించడం కాస్త కష్టంతో కూడుకున్న పని అని చెబుతున్నారు.
Recommended Video
లడాఖ్కు M-777 గన్లు తరలింపు
ఇదంతా ఇలా ఉంటే ఏ సమయమైనా సరే చైనా నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్న భారత్... బలగాలను సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే తేలికపాటి యుద్ధ ట్యాంకులు T-15ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే T-72,T-90తో పాటు అర్జున్ ట్యాంకులు కూడా భారత ఆర్మీలో ఉన్నాయి. ఇదిలా ఉంటే చైనా కదలికలను పసిగడుతున్న భారత్ అంతే స్థాయిలో వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే M-777 గన్స్ను అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడాఖ్కు తరలించింది. వీటిని ఈ మధ్యనే అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఈ గన్లను దేశవ్యాప్తంగా పలు ఆర్మీ రెజిమెంట్లకు అప్పగించింది. ఒక్కో రెజిమెంటులో 18 గన్స్ ఉంటాయి. M-777 గన్స్ తేలికగా ఉంటాయి కాబట్టి హెలికాఫ్టర్లలో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటన్నితో పాటు ఎల్ఏసీ వద్ద చినూక్ హెలికాఫ్టర్లను సైతం భారత ఆర్మీ మోహరించింది.
మొత్తానికి భారత ఆర్మీ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు చూస్తుంటే చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు సన్నద్ధంగా ఉందనే విషయం స్పష్టం అవుతోంది.