భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: పాత మ్యాప్ ప్రకారమే సరిహద్దులున్నాయన్న భారత్
న్యూఢిల్లీ: నేపాల్తో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత కేంద్ర హొంశాఖ కొత్తగా తీసుకువచ్చిన మ్యాప్ పై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్ కొత్తగా డిజైన్ చేసిన మ్యాప్లో సరిహద్దులోని కాలాపాని ప్రాంతాన్ని భారత్లో కలిపేయడం సరికాదని నేపాల్ అభ్యంతరం తెలిపింది. అయితే కాలాపాని ప్రాంతం నేపాల్కు చెందుతుందని దీన్ని భారత్ సరిచేసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల కార్యదర్శి రవీష్ కుమార్ స్పష్టత ఇచ్చారు.
సరిహద్దుల పరిధిని దాటలేదు: రవీష్ కుమార్
కొత్తగా రూపొందించిన మ్యాప్లో అన్నీ కరెక్టుగానే ఉన్నాయని సరిహద్దు ప్రాంతాల పరిధిని కూడా దాటలేదని క్లారిటీ ఇచ్చారు రవీష్ కుమార్. అయితే సరిహద్దు రేఖలను డిజైన్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత్ భూభాగం ఏమేరకు ఉందో మ్యాప్లో కూడా అంత వరకే ప్రస్తావించామని రవీష్ చెప్పారు. అంతేకాదు పరిధి మించి మరో దేశ బౌండరీలను భారత్ మ్యాప్లో కలపలేదని వివరణ ఇచ్చారు. నేపాల్తో సరిహద్దుల విషయంలో ఎలాంటి పరిధులు దాటలేదని చెప్పారు. పాత మ్యాప్లో ఎలా అయితే ఉన్నిందో కొత్త మ్యాప్లో కూడా సరిహద్దులు అలానే ఉన్నాయని చెప్పారు.
భారత్-నేపాల్ మధ్య చర్చలు
జనవరి 15న సరిహద్దు విషయమై భారత్తో నేపాల్ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని నేపాల్ మీడియా కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి రవీష్ కుమార్ సరిహద్దులపై స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దుపై నెలకొన్న వివాదంను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని నేపాల్ భావిస్తోందని ఇందుకోసం ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోందని భారత్లో నేపాల్ దౌత్యాధికారిగా ఉన్న నీలాంబర్ ఆచార్య తెలిపారు. అంతేకాదు కాలాపాని సరిహద్దు అంశాన్ని వెంటనే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని లేనిపక్షంలో ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
ఒరిజినల్ మ్యాప్ సబ్మిట్ చేయాలన్న నేపాల్ సుప్రీంకోర్టు
ఇదిలా ఉంటే 1816లో భారత్-నేపాల్ మధ్య జరిగిన సుగౌలి ఒప్పందం సందర్భంగా నాడు ఇరు దేశాలు మార్చుకున్న ఒరిజినల్ మ్యాప్ను 15 రోజుల్లోగా సబ్మిట్ చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేపాల్ భూభాగంను పరిరక్షించాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేసును విచారణ చేసిన న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.