సరిహద్దు గ్రామాల ప్రజల ఆవేదన: కాపలా కాస్తున్న పురుషులు
న్యూఢిల్లీ: యూరీ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్థానికులు అంటున్నారు. పీఓకేలోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మందుస్తు చర్యల్లో భాగంగా సరిహద్దులోని పది కిలోమీటర్ల మేర గ్రామాలను భారత ప్రభుత్వం ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే.
ఇలా చేయడం వెనుక భారీ వ్యూహమే ఉందని అంటున్నారు. ఇస్రోకు సంబంధించిన శాటిలైట్ల ద్వారా సరిహద్దుల్లో గస్తీని శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. పాక్ సైనికులు లేదా ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్పై దాడి చేయవచ్చనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు సరిహద్దు గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది.
ఆర్మీ కూడా ఈ చర్యను సమర్ధించింది. శనివారం కూడా భారత్, పాకిస్థాన్ భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో సరిహద్దు గ్రామాలు చేయడం వల్ల కొత్తవారు ఎవరైనా కనిపిస్తే వెంటనే చర్యలకు ఉపక్రమించొచ్చు. ఇందులో భాగంగానే పంజాబ్ లో సుమారు వెయ్యి గ్రామాలకు పైగా ప్రజలను ఖాళీ చేయించారు.
దీంతో వారంతా దగ్గర్లోని గ్రామాల్లో బంధువుల ఇళ్లలో తమ మహిళలను ఉంచి పురుషులు మాత్రం పగటి పూట తమ గ్రామాలకే వస్తున్నారు. అంతేకాదు ఎవడొస్తాడో రానీ చూసుకుందామంటూ సవాల్ విసురుతున్నారు. అందుకు తగిన కారణాలను కూడా చెబుతున్నారు.
తామంటే తట్టా బుట్టూ సర్దుకుని వెళ్లగలుగుతున్నామని, తమ పశువులను తీసుకెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తమ చేత ఇళ్లను ఖాళీ చేయించింది కానీ, పునరావాసం కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెంపుడు జంతువులు, పంటపొలాలను కాపాడుకునేందుకు తాము మళ్లీ సరిహద్దు గ్రామాలకు చేరామని తెలిపారు.
గ్రామాలన్నీ ఇంచుమించు నిర్మానుష్యంగా మారాయని, అయితే తాము గ్రామాల్లో ఉండడం వల్ల కొత్తవారు ఎవరైనా సంచరిస్తే వెంటనే సాయుధబలగాలకు సమాచారం అందించవచ్చన ఉద్దేశంతో తాము గ్రామాలను వీడడం లేదని వారు తెలిపారు. తాము పుట్టిపెరిగిన ఊళ్లను వదిలి ఇంతవరకు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఎప్పుడూ చోటు చేసుకోలేదని అంటున్నారు.