భారత్ అమెరికాల మధ్య చర్చలకు బ్రేక్..ఎందుకో తెలుసా..?
అమెరికా భారత్ దేశాల మధ్య జూలై 6న జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలకు బ్రేకులు పడ్డాయి. పర్షియన్ గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతిని నిలిపివేసుకోవాలన్న ట్రంప్ ఆదేశాలను భారత్ తిరస్కరించడంతో ఈ గందరగోళం నెలకొంది. భారత్ అమెరికాల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడటం ఇది రెండో సారి. ముందుగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్గా రెక్స్ టిల్లర్సన్ రాజీనామా చేసిన సమయంలో ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉండగా జరగలేదు.
కొన్ని అనివార్య కారణాలతో భారత్ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం లేదని తెలిపేందుకు అమెరికా చింతిస్తోందని మైక్ పాంపే సుష్మాస్వరాజ్కు తెలిపినట్లు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇరుదేశాలకు అనుకూలంగా ఉండే కొత్త తేదీలను ప్రకటించాలని మైక్ సుష్మాను కోరినట్లు రవీష్ కుమార్ తెలిపారు. వేదిక భారత్ లేదా అమెరికా ఉన్నా ఫర్వాలేదని సుష్మాకు మైక్ తెలిపినట్లు రవీష్ కుమార్ వెల్లడించారు. ఈ చర్చలు జరగాల్సిందిగా గతేడాది జూన్లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయం.
ఇదిలా ఉంటే కొన్ని కీలక విషయాలపై మైక్ పర్యటించాల్సి ఉండగా... భారత్తో చర్చలు వాయిదా వేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.జూలై 10న అమెరికా రష్యా అధ్యక్షులు భేటీ అయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుతం మైక్ ఆ వ్యవహారాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.