రూ.100 లంచం ఇవ్వలేదని... ఆ బాలుడి పట్ల నిర్దాక్షిణ్యంగా... వైరల్ వీడియో...
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రూ.100 లంచం ఇవ్వలేదన్న కారణంగా అధికారులు ఓ కోడిగుడ్ల బండిని రోడ్డుపై అడ్డంగా పడేసి వెళ్లిపోయారు. అసలే లాక్ డౌన్ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయి ఉన్నవేళ.. అధికారులు ఇలా చిరు వ్యాపారుల పట్ల రెచ్చిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లెఫ్ట్-రైట్ నిబంధన...
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఇండోర్లో లెఫ్ట్-రైట్ నిబంధన అమలవుతోంది. దీని ప్రకారం... రోడ్డుకు లెఫ్ట్ వైపు ఉండే షాపులు ఒకరోజు,రైట్ వైపు ఉండే షాపులు మరొక రోజు తెరవాలి. అయితే ఈ నిబంధన అమలులోకి వచ్చినప్పటి నుంచి తోపుడు బండ్లతో చిరు వ్యాపారం చేసుకునేవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. అధికారులు చిరు వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కోడిగుడ్ల తోపుడు బండిని పడేసిన అధికారులు...
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ తోపుడు బండిపై కోడి గుడ్లు అమ్ముతున్న 14 ఏళ్ల ఓ బాలుడి వద్దకు వెళ్లిన అధికారులు రోడ్డుపై బండి పెట్టవద్దని హెచ్చరించారు. అయితే అదే తనకు జీవనాధారం అని చెప్పానని.. దీంతో రూ.100 డబ్బులు డిమాండ్ చేశారని బాలుడు ఆరోపిస్తున్నాడు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో.. తన బండిని రోడ్డుపై అడ్డంగా పడేసి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నాడు. అసలే లాక్ డౌన్ కష్టాలతో చితికిపోయిన తాను... అధికారులు కోడిగుడ్లను పగలగొట్టడంతో మరింత నష్టపోయానని వాపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన తోపుడు బండిని పడేసిన ఇద్దరు మున్సిపల్ అధికారుల పట్ల ఆ బాలుడు ఫైర్ అవుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ నిబంధనను రద్దు చేయాలన్న డిమాండ్...
ఇండోర్లో కరోనా నియంత్రణ కోసం తీసుకొచ్చిన లెఫ్ట్-రైట్ నిబంధన వల్ల చిరు వ్యాపారులు చితికిపోతారని... దాన్ని రద్దు చేయాలని ఇదివరకే పలువురు నేతలు ప్రభుత్వాన్ని కోరారు. అధికార పార్టీకి చెందిన బీజేపీ నేతలు సైతం ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర హోర్దియా... ఈ నిబంధనను రద్దు చేయాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ కూడా రాశారు. మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ నిబంధనను తొలగించలేదు. తాజా ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడైనా దీనిపై పునరాలోచిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.