కుదుబులతో, భారీ శబ్దాలతో.. అత్యంత ఘోర ప్రమాదం: గాఢనిద్రలో.. (పిక్చర్స్)
పుఖ్రాయాన్ వద్ద ఇండోర్ - పాట్నా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోర రైలు ప్రమాదం.
లక్నో: ఆదివారం తెల్లవారుజామున యూపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో వందకు పైగా చనిపోయారు. పుఖ్రాయాన్ వద్ద ఇండోర్ - పాట్నా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోర రైలు ప్రమాదం. 2010 తర్వాత జరిగిన ఘోర రైలు ప్రమాదం కూడా ఇదే. కాగా, ప్రమాదం నేపథ్యంలో అక్కడే చిక్కుకున్న ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఘోర ప్రమాదం
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో పట్నా - ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందారు. 226 మందికి పైగా గాయపడ్డారు.
నిద్రలో ప్రాణాలు కోల్పోయారు
ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సహాయక చర్యలు
సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్సెంటర్లు ఏర్పాటు చేశారు.
సురేష్ ప్రభు ఆదేశం
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పందించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధికారులందరూ తక్షణం ప్రమాదస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మోడీ దిగ్భ్రాంతి
రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
పరిహారం
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పగాయాలైన వారికి రూ.25వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
రైల్వే శాఖ పరిహారం
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.3.5లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
గాఢనిద్రలో
ఈ రైలు ప్రమాదం ఘటన నుంచి ప్రయాణికులు ఇప్పుడిప్పుడే తేరుకునేలా లేరు. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను భారీ సంఖ్యలో బలితీసుకున్నఈ ప్రమాదం గురించి తలుచుకుంటేనే వారి గుండెళ్లొ రైళ్లు పరుగెడుతున్నాయి.
గతంలో చూడని ప్రమాదం.. దేవుడి దయవల్లే
గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదాన్ని చూడలేదనీ, రైలు ఒక్కసారిగా కుదుపులకు లోనై, భారీ శబ్దాలతో బోగీలు చెల్లాచెదురయ్యాయని అంటున్నారు. అదృష్టం వల్లనే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని, దేవుడి దయవల్లే ప్రాణాలతో బయటపడ్డామని కొందరు చెబపుతున్నారు.
విషాదం
ప్రమాదంలో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో వారి తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారుల పరిస్థితి అక్కడి వారిని కంటతడి పెట్టించింది.