‘రైలు చక్రాల నుంచి భారీ శబ్దం, పట్టించుకోలేదు’: 142కు చేరిన మృతి
ప్రమాదం జరుగకముందు ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ రైలు చక్రాల నుంచి భారీ శబ్దం వచ్చిందని ప్రకాశ్ శర్మ(35) అనే ప్రయాణికుడు చెప్పారు. దీని గురించి తాను రైల్వే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
ఇండోర్: ప్రమాదం జరుగకముందు ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ రైలు చక్రాల నుంచి భారీ శబ్దం వచ్చిందని ప్రకాశ్ శర్మ(35) అనే ప్రయాణికుడు చెప్పారు. దీని గురించి తాను రైల్వే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అయితే వారు పట్టించుకోలేదని అన్నారు.
'నేను శనివారం ఇండోర్పాట్నా ఎక్స్ప్రెస్ రైలు ఎస్2 బోగీలో ఎక్కాను. మధ్యాహ్నం సమయంలో ఉజ్జయినిలో దిగాను. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో చక్రాల నుంచి వస్తున్న శబ్దం గురించి అధికారికి చెప్పినా వారు పట్టించుకోలేదు' అని పేర్కొన్నారు.
అయితే, తాను సమాచారం అందించిన అధికారి పేరు తనకు తెలియదని ఆయన చెప్పారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగి 121మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వందలాది మందికి గాయాలయ్యాయి.
142 చేరిన మృతులు
శనివారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 142కు చేరుకుంది. గాయాలపాలైన 200మందికి పైగా ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన మార్గంలో ఇతర రైళ్లు వెళ్లేందుకు వీలుగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి రైలు బోగీలను పూర్తిగా తొలగించామని, సహాయక చర్యలు పూర్తయ్యాయని కాన్పుర్ రేంజ్ ఐజీ జాకీ అహ్మద్ వెల్లడించారు.