కాఫీలో విషం: సెల్ఫీ దిగి ఆత్మహత్య చేసుకున్న యువతులు
జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు యువతులు కాఫీలో విషం కలుపుకుని తాగి చనిపోయారు. అంతకుముందు ఆ కాఫీ కప్పులతో సెల్ఫీలు దిగడం గమనార్హం. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో చోటు చేసుకుంది.
ఇండోర్: జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు యువతులు కాఫీలో విషం కలుపుకుని తాగి చనిపోయారు. అంతకుముందు ఆ కాఫీ కప్పులతో సెల్ఫీలు దిగడం గమనార్హం. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. ఇండోర్లోని గురునగర్ ప్రాంతానికి చెందిన రచన, తన్వి అనే ఇద్దరు యువతులు స్థానిక కాల్సెంటర్లో పనిచేస్తున్నారు. రచనకి వివాహమై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, ఆమె తన భర్తను వదిలేసి తన్వితో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటోంది.
తనకు భర్త అంటే ఇష్టంలేదని, తాను చనిపోయాక కుమారుడిని తన తల్లిదండ్రులే చూసుకోవాలని సూసైడ్ లేఖలో పేర్కొంది. తన్వి మాత్రం తనకు జీవితంపై విరక్తి కలగడంతో చనిపోతున్నానని తన సూసైడ్ నోట్లో తెలిపింది. ఆ తర్వాత విషం తాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, చనిపోయే ముందు విషం ఉన్న కప్పులతో సెల్ఫీ దిగడం గమనార్హం. బుధవారం ఉదయం ఇంటి యజమాని గదిలోకి వెళ్లిచూడగా ఇద్దరూ నేలపై నిర్జీవంగా పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.