స్కర్ట్ ధరించిన మోడల్కు లైంగిక వేధింపులు: శిక్షిస్తామని సీఎం ప్రకటన
ఇండోర్:నడిరోడ్డుపై ఇద్దరు యువకులు తనను లైంగికంగా వేధించారని ఓ హోడల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తాను బైక్పై వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వెంబడించి తన స్కర్ట్ను లాగేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. ఇండోర్లోని రద్దీగా ఉండే రోడ్డులోనే సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాను స్కర్ట్ ధరించి తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ఇద్దరు ఆకతాయిలు తన స్కర్ట్ను లాగేందుకు ప్రయత్నించారని ఆ మోడల్ తన పోస్ట్లో ప్రకటించింది. అసభ్య వ్యాఖ్యలను చేశారని ఆ పోస్ట్లో ఆమె ప్రస్తావించారు. ఆకతాయిలను తాను ఆపేందుకు ప్రయత్నించినట్టు బాధితురాలు చెప్పారు. అయితే వారు తనకు దొరకకుండా తప్పించుకొన్నారని చెప్పారు.
అయితే అదే సమయంలో తాను బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయానని బాధితురాలు చెప్పారు. ఈ గందరగోళంలో తాను ఆకతాయిల బండి నెంబర్ను కూడ చూసుకోలేదన్నారు. కానీ, ఆ సమయంలో తాను నిస్సహయురాలిని ఉండిపోవాల్సి వచ్చిందని బాధితురాలు చెప్పారు. తన స్నేహితులు తనను దగ్గరిలోని కేఫ్ వద్దకు తీసుకెళ్ళారని ఆమె చెప్పారు.
ఏ రకమైన దుస్తులు వేసుకోవాలనేది తన వ్యక్తిగత ఇష్టమన్నారు. అయితే స్కర్ట్ వేసుకొన్నంత మాత్రాన అసభ్యంగా ప్రవర్తించేందుకు అవకాశం ఇచ్చినట్టు కాదన్నారు. రద్దీగా ఉండే రోడ్డులోనే ఈ రకంగా ఇబ్బందులు పెడితే జనసమ్మర్ధం లేని రోడ్లలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ట్విట్టర్ వేదికగా సీఎం ప్రకటించారు.