సుప్రీంకోర్టుకు రిజర్వేషన్ బిల్లు... పిటిషన్ వేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా?
ఎన్నికలకు ముందు మోడీ సర్కారు తీసుకొచ్చిన అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు అంశం కోర్టులకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ కోర్టులో ఎవరు పిటిషన్ దాఖలు చేస్తున్నారు... అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో అన్ని విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. మరి ఈ బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారు...? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
1992లో దేశవ్యాప్తంగా మోగిన అడ్వకేట్ ఇంద్రసహానీ పేరు
ఇంద్రసహానీ.... ఒకప్పుడు బాగా వినిపించిన పేరు. పేరుగాంచిన సుప్రీం కోర్టు అడ్వకేటు. 1992లో నాడు పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో ఈమె పేరు బాగా వినిపించింది. నాడు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 10శాతం రిజర్వేషన్ పెంచాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇంద్ర సహానీ పిటిషన్ వేశారు. దీంతో సుప్రీం కోర్టు రిజర్వేషన్ల శాతంపై సీలింగ్ విధిస్తూ తీర్పు చెప్పింది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని ఆదేశాలు జారీ చేసింది. నాడు ఈ ఘనత ఇంద్రసహానీకి దక్కిందని చెబుతారు. ఇప్పుడు అదే చరిత్ర రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇంద్ర సహానీ దీనిపై స్పందించారు. రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఉద్యోగావకాశాల్లో, విద్యావకాశాల్లో అర్హులైన అభ్యర్థులు నష్టపోతారని ఆమె వాదిస్తున్నారు.
సుప్రీంకోర్టులో రిజర్వేషన్ బిల్లు సవాల్ చేస్తాం
"కేంద్రం తీసుకొచ్చిన బిల్లును కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఈ రాజ్యాంగ బిల్లుపై కోర్టులో పిటిషన్ వేయడంపై ఆలోచన చేస్తున్నాను. ఈ బిల్లు అమలైతే 50శాతంగా ఉన్న రిజర్వేషన్ సీలింగ్ను 60శాతంకు పెంచినట్లు అవుతుంది. దీనివల్ల జనరల్ కేటగిరీలోని అభ్యర్థులు అర్హులైన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగ బిల్లును సుప్రీం కోర్టు కొట్టివేస్తుంది " అని ఇంద్ర సహానీ అన్నారు. ఇక నాటి పరిస్థితులను ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. నాడు పీవీ నరసింహారావు ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయం తీసుకున్న సమయంలో చాలామంది నిరసనలు వ్యక్తం చేశారని... అప్పుడే పిటిషన్ వేయాలని తాను భావించి పిటిషన్ వేసినట్లు నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ చాలా బెంచ్ల ముందుకు విచారణకు వెళ్లిందని చివరిగా జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ విధిస్తూ తీర్పు చెప్పిందని గుర్తుచేశారు.
పీవీ నరసింహారావు జారీ చేసిన నోటిఫికేషన్ నాడు రద్దు చేసిన సుప్రీం
నాడు రిజర్వేషన్లకు సంబంధించి దేశంలో నెలకొన్న పరిస్థితిపై మీడియా విపరీతమైన కవరేజ్ ఇచ్చిందని వెల్లడించిన సహానీ... పిటిషన్ను ముందుగా ద్విసభ్య ధర్మాసనం ముందుకు రాగా... ఆ తర్వాత త్రిస్వభ్య ధర్మాసనం ముందుకు అనంతరం ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చిందని... చివరిగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం తొమ్మిది సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ఇక తొమ్మిది సభ్యుల ధర్మాసనం మండల్ కమిషన్ నివేదికకు ఓకే చెప్పింది. బీసీలకు 27శాతం , ఎస్సీ ఎస్టీ ఇతర వెనకబడిన వర్గాల వారికి కలిపి రిజర్వేషన్లు 50శాతం సీలింగ్ దాటకూడదని తీర్పు వెల్లడించినట్లు సహానీ చెప్పారు. అంతేకాదు నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చిన 10శాతం రిజర్వేషన్ల నోటిఫికేషన్ను కొట్టివేసింది. 1992 సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 16(4) అధికరణ వెనకబడిన వర్గాల వారిని కులం ఆధారంగానే గుర్తిస్తారని ఆర్థిక పరిస్థితుల పరంగా కాదని సుప్రీం కోర్టు గుర్తించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లను సవరణ చేసేందుకు మోడీ సర్కార్ అడుగులు వేస్తోందని దీన్ని కోర్టు కొట్టివేస్తుందనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు ఇంద్ర సహానీ.