జైల్లో దోమలు: ఇంద్రాణికి డెంగ్యూ, ఆస్పత్రికి
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా గత ఏడు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో జెజె ఆస్పత్రి వైద్యులు వచ్చి ఆమెకు బైకుల్లా జైలులో వైద్యం అందించారు.
అయితే ఆమె ప్లేట్లెట్ లెవెల్స్ 65,000కు పడిపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇంద్రాణిని ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల ప్రారంభంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అటు జైలు అధికారులను, షీనా కేసు దర్యాప్తు అధికారులు ఇంద్రాణి కలవరపెట్టిన విషయం తెలిసిందే.
ఆమెకు కొద్ది రోజులపాటు చికిత్స చేసి తిరిగి జైలుకు తరలించారు. 2012 ఏప్రిల్ 24న కుమార్తె షీనా బోరాను ఇంద్రాణి తన రెండో భర్త సంజీవ్ ఖన్నా సాయంతో చంపేసింది.
అనంతరం మృతదేహాన్ని రాయ్గఢ్ అడవుల్లో పూడ్చేశారు. హత్య సమయంలో కారు నడిపిన డ్రైవర్ రాయ్ మరో కేసులో అరెస్టై ఈ కేసుకు సంబంధించి అసలు విషయం పోలీసులకు చెప్పడంతో ఇంద్రాణిని, ఆమె రెండో భర్త సంజీవ్ను అరెస్ట్ చేశారు.