విషాదం: చిన్నారి ప్రాణం తీసిన ఉల్లిపాయ
బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తెలీక ఉల్లిపాయ మింగేయడంతో ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. కనహోసాహళ్లి గ్రామానికి చెందిన కల్పేశ్, అర్చనల ఒక్కగానొక్క కూతురు నిత్యశ్రీ శనివారం వరండాలో ఆడుకుంటోంది.
అదే చోట తల్లి అర్చన ఉల్లిపాయలు ఆరబెట్టి పక్కింటి వారితో మాటల్లో పడిపోయింది. ఇంతలో చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న ఓ ఉల్లిపాయను నోట్లో పెట్టుకుంది చిన్నారి. దీంతో అది గొంతులో ఇరుక్కుపోవడంతో పాపకి ఊపిరాడలేదు.
అంతేగాక, ఆ చిన్నారి గట్టిగా అరవలేకపోయింది. కాసేపటికి తల్లి వచ్చి చూసేసరికి చిన్నారి స్పృహలేకుండా పడివుంది. వెంటనే చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆలస్యమైపోయిందని, పాప ఊపిరాడక చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
కాగా, ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటుండటం గమనార్హం. తల్లిదండ్రుల నిర్లక్ష్య వైఖరి వారికి శాపంగా మారి, తీరని ఆవేదనను మిగుల్చుతున్నట్లు తెలుస్తోంది. కాగా, చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.