దారుణం : పసిపాప ప్రాణం తీసిన డాక్టర్లు
బరేలీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం పసిగుడ్డు ప్రాణాలు తీసింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న నాలుగు రోజుల చిన్నారికి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో డాక్టర్లు దారుణంగా వ్యవహరించారు. హాస్పిటల్లోని ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కు పంపుతూ నరకం చూపారు. దాదాపు మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి చివరకు కన్నుమూసింది. దీనిపై నిరసన వ్యక్తం కావడంతో జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ డాక్టర్ను సస్పెండ్ చేశారు.
నాలుగేళ్ల చిన్నారిపై రేప్.. డాక్టర్లను చితకబాదిన బంధువులు (వీడియో)
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
బరేలీకి చెందిన దంపతులకు జూన్ 15న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పాప పుట్టింది. ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టుకున్నారు. అయితే పాప పుట్టిన రెండు రోజుల అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో డాక్టర్లు చిన్నారిని మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చిన్నారి తండ్రి, నాయనమ్మలు ఆమెను బరేలీ టౌన్లోని గవర్నమెంట్ హాస్పిటల్ కాంప్లెక్స్కు తీసుకెళ్లారు. అయితే అక్కడ పసిగుడ్డుకు తక్షణ వైద్యం అందించాల్సిన డాక్టర్లు వారికి నరకం చూపారు.
బిల్డింగ్ల చుట్టూ తిప్పిన డాక్టర్లు
హాస్పిటల్ కాంప్లెక్స్లో పురుషులు, మహిళలకు వేర్వేరు బిల్డింగుల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. చిన్నారి తీసుకుని మొదట పురుషుల విభాగం ఉన్న బిల్డింగ్కు వెళ్లారు. అక్కడ పసిపాపను కనీసం పరీక్షించని డాక్టర్లు మహిళా హాస్పిటల్కు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో చిన్నారి తండ్రి మళ్లీ ఉమెన్ హాస్పిటల్కు పరుగుతీశాడు. అక్కడికి వెళ్లి పాప పరిస్థితి వివరించగా.. బెడ్లు ఖాళీ లేవన్న కారణంతో పాపాను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు. తిరిగి మెన్స్ హాస్పిటల్కు తీసుకెళ్లాలని చెప్పారు.
ముడు గంటల పాటు నరకం
ఇలా డాక్టర్ల కారణంగా పసిపాపను ఎత్తుకిని ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కు దాదాపు మూడు గంటల పాటు తిరిగినా ఫలితం లేకుండాపోయింది. రెండు హాస్పిటళ్లలో డాక్టర్లు చిన్నారిని అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించే స్థోమతలేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్నారి తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. సమయానికి ట్రీట్మెంట్ అందకపోవడంతో ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది.
డాక్టర్ను సస్పెండ్ చేసిన సీఎం
చిన్నారి మరణంపై నిరసనలు వెల్లువెత్తడంతో రెండు హాస్పిటళ్ల డాక్టర్లు వాగ్వాదానికి దిగారు. పాప మృతికి కారణం నువ్వంటే నువ్వంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. విషయం సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేల్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. మహిళా ఆస్పత్రి డాక్టర్పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.