డబ్బులిస్తేనే ప్రభుత్వ వైద్యం: రెండేళ్ళ చిన్నారి మృతి
బెంగళూరు: పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యశాలలు వారికి అందని ద్రాక్షలానే మిగిలిపోతున్నాయి. తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే.. అక్కడ వైద్యం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని వైద్య సిబ్బంది పట్టుపట్టారు.
పేదలైన వారు డబ్బులు చెల్లించలేమని వేడుకున్నా వైద్య సిబ్బంది కనికరించకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఓ రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు రెండోఅంతస్తు భవనంపైనుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్ చేసుకోని వైద్యులు.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
దీంతో చేసేదేమి లేక బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన నిమ్హన్స్కు తీసుకెళ్లారు. ఉదయం 11గంటల ప్రాంతంలో చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ కూడా వైద్యులు చికిత్స అందించేందుకు నిరాకరించారు. డబ్బులు చేతిలో పెడితేనే వైద్యం చేస్తామని తేల్చి చెప్పారు.
తాము డబ్బులు చెల్లించుకోలేమని తమ పాప ప్రాణాలు కాపాడాలని ఎంత వేడుకున్న కనికరించలేదు ఆస్పత్రి వైద్య సిబ్బంది. వెంటిలేటర్పై వైద్యం అందించాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.
కాగా, తీవ్ర రక్తస్రావం కావడం, మధ్యాహ్నం వరకూ చికిత్స అందించకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యులే తమ కూతుర్ని హత్య చేశారని మండిపడ్డారు. సరైన సమయంలో తమ బిడ్డకు వైద్యం అందించివుంటే బతికి ఉండేదని విలపించారు.
ఈ ఘటనలో వైద్యుల తప్పేమిలేదన్నట్లు ప్రభుత్వం వైఖరి ఉంది. వెంటిలేటర్లు తక్కువగా ఉండటం వల్లే వైద్య సిబ్బంది ఆ చిన్నారికి వైద్యం అందించలేకపోయారని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పడం గమనార్హం. అయితే, ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.