కరోనా : ఆ డేటా ఎందుకు ఎగిరిపోయింది...? ఐసీఎంఆర్ ఎందుకు బయటపెట్టట్లేదు...
కరోనా వైరస్ సంక్రమణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ ఏడాది మే ప్రారంభంలో ఐసీఎంఆర్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా రూపొందించిన పరిశోధన పత్రాన్ని ఈ నెల ప్రచురించగా... అందులో 10 నగరాలకు సంబంధించిన కంటైన్మెంట్/హాట్స్పాట్ల డేటా లేకుండా పోయింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ ఆదేశాల మేరకే ఈ డేటాను పేపర్ నుంచి తొలగించినట్లుగా పరిశోధకులు పేర్కొనడం గమనార్హం. అయితే ఈ డేటాను పేపర్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చింది.. ఆ లెక్కలను ఎందుకు బయటపెట్టలేదు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇండియాలో కరోనా దెబ్బ.. టాప్ 5 రాష్ట్రాలివే .. 90 వేలు దాటిన మృతుల సంఖ్య !!
ఐసీఎంఆర్ డైరెక్టర్ ఏమంటున్నారు...
ఈ వ్యవహారంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ... శాంపిల్స్ సైజు తక్కువగా ఉన్నందున ఇటీవల ప్రచురించిన మొదటి జాతీయ సెరోసర్వే అధ్యయన పత్రంలో ఆ డేటా చేర్చబడలేదని చెప్పారు. పైగా ఆ 10 నగరాల్లోని కంటైన్మెంట్ జోన్లు,హాట్ స్పాట్లలో రోజు రోజుకు,వార వారానికి లెక్కలు మారిపోతున్నాయన్నారు. ఏదో కొద్దిపాటి శాంపిల్స్తో సర్వే చేసి దాని ఆధారంగా అంచనా వేసే డేటాను అధ్యయన పత్రంలో చేర్చడం కుదరదన్నారు. అందుకే తదుపరి చర్యల కోసం గత సెరో సర్వే ఆధారంగా అంచనా వేసిన డేటానే ఆయా రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు.
వివాదాస్పదమవుతున్న డేటా అంశం...
అయితే ఆ 10 నగరాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందునే ఆ డేటాను ప్రచురించలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రముఖ మీడియా టెలిగ్రాఫ్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ... ఐసీఎంఆర్ ప్రచురించని ఆ డేటాలో హాట్ స్పాట్స్గా ఉన్న నగరాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ముంబైలోని 36శాతం,అహ్మదాబాద్లో 48శాతం,కోల్కతాలో 30శాతం మేర వైరస్ సంక్రమణ ఉన్నట్లు తెలిపింది. కేవలం వైరస్ సంక్రమణ తక్కువగా ఉన్న జిల్లాల డేటాను మాత్రమే ఇందులో ప్రచురించినట్లు చెప్పింది.
ఇది సరికాదంటున్న నిపుణులు...
మరోవైపు ఈ 10 నగరాలకు సంబంధించిన డేటాను వెల్లడించకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాట్ స్పాట్లలో వైరస్ వ్యాప్తికి సంబంధించిన డేటాను ప్రచురించకుండా అడ్డుకోవడం పరిశోధన విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని అంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 70 జిల్లాల్లో 400 మంది చొప్పున శాంపిల్స్ను ఈ సర్వే కోసం సేకరించారు. అహ్మదాబాద్,భోపాల్,కోల్కతా,ఢిల్లీ,హైదరాబాద్,ముంబై,ఇండోర్,జైపూర్,పుణే,సూరత్ నగరాల నుంచి 500 చొప్పున శాంపిల్స్ సేకరించారు. సాధారణ జనాభాలో వైరస్ వ్యాప్తి ఎంతమేర ఉందో తెలుసుకునేందుకు జిల్లాల్లో,వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్న హాట్స్పాట్లలో ఈ సర్వేను నిర్వహించారు. అయితే జిల్లాల లెక్కలను బయటపెట్టి,హాట్ స్పాట్ల డేటాను మాత్రం గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video