షాకింగ్: సెల్ఫోన్స్ వాడకంతో పెరిగిపోతున్న ఇన్ఫెక్షన్లు..
సెల్ ఫోన్ వాడకం వల్ల 81.8శాతం బాక్టీరియల్ పాథోజెన్ వ్యాప్తి చెందుతున్నట్టుగా వారు గుర్తించారు.
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం పెరిగి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. ప్రతీ చోటా మొబైల్ వాడకం పెరిగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న పేషెంట్స్ సైతం మొబైల్ ఫోన్లలో తలదూర్చి కనిపించడం ఈరోజుల్లో షరా మామూలే.
అయితే ఆసుపత్రుల్లో సెల్ ఫోన్స్ వినియోగించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ వాడకం వల్ల 81.8శాతం బాక్టీరియల్ పాథోజెన్ వ్యాప్తి చెందుతున్నట్టుగా వారు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
మొబైల్ ఫోన్స్ వినియోగం వల్ల 81.8శాతం, చేతులను శుభ్రపరుచుకోకపోవడం వలన 80శాతం బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తున్నట్టుగా సర్వే తేల్చింది. ఒకే సెల్ ఫోన్ పలువురు ఉపయోగించడం వల్ల కూడా బాక్టీరియా వ్యాప్తి ఎక్కువవుతున్నట్టు తెలిపారు. ఒకరి సెల్ ఫోన్ మరొకరు ఉపయోగించినప్పుడు.. వారి చేతుల్లోని బాక్టీరియా ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశముందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ తెలిపింది.
ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్స్ ను అరికట్టడానికి పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఐసీఎంఆర్ కొన్ని సూత్రాలను విడుదల చేసింది. ఇవి ఐసీఎంఆర్ వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.కాగా, లోక్ సభలో ఒక సభ్యుడు దీనిపై అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పైన పేర్కొన్న విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.