ఆటోమేషన్ దెబ్బ: 11వేల మంది బయటికి, ఏజీఎంలో వెల్లడించిన ఇన్ఫోసిస్
ఆటోమేషన్ కారణంతో ఈ ఏడాది 11వేల మందికి పైగా ఉద్యోగులను ఇన్ఫోసిస్ బయటికి పంపించి వేసింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ శనివారం బెంగళూరులో జరిగిన 36వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించింది.
బెంగళూరు: న్యూఢిల్లీ : ఆటోమేషన్.. ఉద్యోగుల పాలిట ఏ స్థాయిలో ప్రమాదకరంగా మారుతోందో టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ చెప్పకనే చెప్పేసింది. ఆటోమేషన్ కారణంతో ఈ ఏడాది 11వేల మందికి పైగా ఉద్యోగులను కంపెనీ బయటికి పంపించివేసింది.
ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ శనివారం బెంగళూరులో జరిగిన 36వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించింది. అయితే ఆటోమేషన్, యూటిలైజేషన్, ప్రొడక్టివిటీ మెరుగుదలతో పూర్తిస్థాయి ఉద్యోగి ఆదాయం 1.2 శాతం పెరిగినట్టు తెలిపింది.
ఇటీవల మీడియా సృష్టిస్తున్న పుకార్లపై కూడా ఇన్ఫోసిస్ వివరణ ఇచ్చింది. ప్రమోటర్లకు, కంపెనీ బోర్డుకు ఎలాంటి సమస్యలేదని తెలిపింది. మీడియాలో వస్తున్న రిపోర్టులను ఇన్ఫీ కొట్టిపారేసింది. బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మధ్య మనస్పర్థలు లేవంది.
కంపెనీ చైర్మన్ శేషసాయికి ఇదే చివరి ఏజీఎం. వచ్చే ఏడాది మే నెలలో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. తన మిగతా పదవీ కాలాన్ని కార్పొరేట్ ప్రమాణాలకు అనుగుణంగా షేర్ హోల్డర్స్ విలువను పెంచడానికే కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఏఐ ప్లాట్ ఫామ్ పై 70కి పైగా క్లయింట్స్ ఉన్నారని, కొత్త ప్లాట్ ఫామ్ లే తమకు క్యూ1లో రెవెన్యూలిస్తాయని కంపెనీ పేర్కొంది. తమ యుటిలైజేషన్ 81.7శాతముందని, ఇది దశాబ్దంలోనే అత్యధికంగా వెల్లడించింది. గత 12 ఏళ్లలో అత్యధిక క్లయింట్ల సంతృప్తి సాధించామని చెప్పింది.