చిచ్చు: ఇన్ఫోసిస్ నారాయణకు షాక్, పనితీరు సరిగా లేదుగా...
ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ప్రవీణ్ రావు వేతనాన్ని భారీగా పెంచడాన్ని సీఈవో విశాల్ సిక్కా సమర్థించారు. ఆయన వేతనాన్ని పెంచడాన్ని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తప్పుబట్టారు.
ముంబై: ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ప్రవీణ్ రావు వేతనాన్ని భారీగా పెంచడాన్ని సీఈవో విశాల్ సిక్కా సమర్థించారు. ఆయన వేతనాన్ని పెంచడాన్ని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తప్పుబట్టారు. మిగతా వారు సమర్థిస్తున్నారు. దీంతో ఇన్ఫోసిస్లో ఇది చర్చకు దారి తీసింది.
సీఓఓ ప్రవీణ్ రావు వేతనాన్ని భారీగా పెంచడాన్ని ఇన్ఫోసిస్ గట్టిగా సమర్థించుకుంది. వేతన పెంపు ఆ స్థాయిలో చేయడం సరికాదంటూ ఆదివారం కంపెనీ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి విమర్శించడంతో స్పందించింది. ఉద్యోగులకు కేవలం ఆరు నుంచి ఎనిమిది శాతం వేతనం పెంచి, ప్రవీణ్ రావుకు మాత్రం అరవై నుంచి డెబ్బై శాతం పెంచడం సరికాదంటూ మూర్తి ఆదివారం ఒక ఇ-మెయిల్ ప్రకటన చేశారు.
సర్వే జరిపిన తర్వాతే ప్రవీణ్ రావుకు భారీ వేతనం
తాజాగా ఇన్ఫీ మాజీ అధికారులు టివి మోహన్దాస్ పాయ్, బాలకృష్ణన్లు సైతం మూర్తికి మద్దతుగా నిలిచినప్పటికీ... కంపెనీ మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే వేతన పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేసింది. భారత, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల్లో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తులకు ఇచ్చే వేతన ప్యాకేజీలపై విస్తృతంగా సర్వే జరిపిన మీదటే రావు వేతనాన్ని పెంచినట్లు కంపెనీ తెలిపింది.
సోమారం స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచినా తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు మాత్రం ఒక శాతం దాకా నష్టపోవడం గమనార్హం. ఇన్ఫోసిస్ను మరింత పోటీనిచ్చే కంపెనీగా తయారు చేయాలన్నా, ఇతర దిగ్గజాల స్థాయికి చేరాలన్నా, కీలక నైపుణ్యం ఉన్న వ్యక్తులను అట్టే పెట్టి ఉంచుకోవడం కీలకమని ఒక ప్రకటనలో తెలిపింది. మూర్తి ప్రకటన తమకు ఒక ముఖ్యమైన స్పందన అని అందులో పేర్కొంది.
నగదు విభాగాన్ని తగ్గించాం
కంపెనీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరు వాటాదార్లతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని పేర్కొంది. ప్రవీణ్ రావు ప్యాకేజీ విషయానికి వస్తే నగదు విభాగాన్ని రూ.5.2 కోట్ల నుంచి రూ.4.6 కోట్లకు తగ్గించామని, అయితే పనితీరు ఆధారిత విభాగాన్ని మాత్రం 45 శాతం నుంచి 63 శాతానికి పెంచామని, నాలుగేళ్ల కాలంలో ప్రవీణ్ రావుకు ఇచ్చిన షేర్ల విలువను పరిశీలిస్తే నికరంగా 2017-18కు పెంచింది 1.4 శాతమే అంటున్నారు. నాలుగో ఏడాదిలో 33.4 శాతం పెరిగిందన్నారు.
అంతక్రితం ఏడాదుల్లో కంపెనీ, వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇది జరిగిందని తెలిపింది. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా మాట్లాడుతూ.. కంపెనీకి ప్రవీణ్ రావు అందించిన సేవలు అద్భుతమని, గత మూడేళ్లలో కంపెనీ సాధించిన ప్రగతిలో ఆయన భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. వేతన పెంపు ప్రతిపాదనకు కంపెనీ వాటాదార్లు 67% ఓటింగ్తో అంగీకారం తెలిపారన్న విషయాన్ని సంస్థ నొక్కి చెప్పింది.
ఇన్ఫోసిస్లో ఇదే తొలిసారి కాదు..
ఇన్ఫోసిస్ బోర్డు తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. రెండు నెలల కిందట.. సీఈఓ విశాల్ సిక్కా, మాజీ అధికారులైన రాజీవ్ బన్సల్, డేవిడ్ కెన్నడీలకు భారీ ప్యాకేజీలు ప్రకటించిన సమయంలోనూ బోర్డుకు, కంపెనీ వ్యవస్థాపకులకు మధ్య భేదాభిప్రాయాలు కనిపించాయి. కంపెనీ ప్రమోటర్లకు (వ్యవస్థాపకులతో కలిపి) ఇన్ఫోసిస్లో పదమూడు శాతం వాటా ఉంది.
అంత ఎందుకిచ్చారు: బాలకృష్ణన్
కిందిస్థాయి ఉద్యోగులు త్యాగాలు చేయాలంటూ చెబుతూ, ఓ అత్యున్నతాధికారికి మాత్రం భారీ స్థాయిలో వేతనాన్ని పెంచడం ఎంత మాత్రం సబబు కాదని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి బాలకృష్ణన్ పేర్కొన్నారు. పాలనలో అత్యున్నత ప్రమాణాలు పాటించే కంపెనీగా, నైతికత విలువలను పాటించే సంస్థగా ఇన్ఫోసిస్కు పేరుందని, అయితే ప్రస్తుత యాజమాన్యం ఆ కంపెనీ ప్రతిష్ఠను మంటగలుపుతోందని, బోర్డు ఏం చేయకూడదో ఆ పనులే చేస్తోందన్నారు.
తాను ఏమో తన సహోద్యోగులకు త్యాగం చేయమని చెబుతానని, కంపెనీ వ్యయాలు తగ్గించుకోవడం కోసం వేతన పెంపు తక్కువగా తీసుకోమని చెబుతానని, తాను మాత్రం 40-50% పెంపును తీసుకుంటానని, ఇలా చేయడం ఏ నాయకత్వానికీ మంచిది కాదని బాలకృష్ణన్ చెప్పారు.
కంపెనీ విషయాలను ప్రమోటర్లు ఇలా ప్రజల మధ్యకు తీసుకురావడం అవసరమా అని ప్రశ్నించగా.. బోర్డు తమ నుంచి స్పందనలను, అభిప్రాయాలను తీసుకుంటుంది కానీ వాటినేమీ అమలు చేయడం లేదని, అందుకే ఇలా ప్రజల ముందుకు రావాల్సి వస్తోందని బాలకృష్ణన్ అన్నారు.
పనీతీరు వేతనం స్థాయిలో లేదు: పాయ్
ప్రవీణ్ రావు వేతన పెంపు సక్రమంగా జరగలేదని మాజీ డైరెక్టర్ టివి మోహన్దాస్ పాయ్ సైతం తప్పుపట్టారు. ప్రవీణ్ విషయంలో వేతనం అద్భుతంగా ఉందని అయితే పనితీరు మాత్రం ఆ స్థాయిలో లేదని పాయ్ పేర్కొన్నారు. అసలు సమస్యల్లా అంతక్రితం సీఈఓ విశాల్ సిక్కాకు సమర్థించేందుకు వీలులేని విధంగా వేతనాన్ని పెంచడమేనని పేర్కొన్నారు. అందువల్లే ఇతర ఎగ్జిక్యూటివ్లు సైతం ఎక్కువ వేతనాన్నే కోరుకుంటున్నారని, అమెరికా స్థాయి వేతనాలతో భారత్ను పోల్చుకోకూడదని చెప్పారు.
తాను పూర్తిగా నారాయణ మూర్తి వ్యాఖ్యలతో అంగీకరిస్తున్నానని పాయ్ చెప్పారు. అమెరికా కంపెనీల్లాగా మనం వ్యవహరించలేమని, ఇన్ఫోసిస్ అమెరికా కంపెనీ కాదు కదా అన్నారు.