ఇలా చేస్తే ఐటీ జాబ్స్ కోతలే ఉండవు: టెక్కీలకు ఊపిరిపోస్తున్న నారాయణ మూర్తి
ఇటీవల కాలంలో తమ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడతాయో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ విరుగుడు మంత్రాన్ని కనుగొన్నారు.
బెంగళూరు: ఇటీవల కాలంలో తమ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడతాయో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ విరుగుడు మంత్రాన్ని కనుగొన్నారు. దీనిని అమలు చేస్తే ఉద్యోగల కోతకు అడ్డుకట్ట వేయవచ్చునని స్పష్టం చేస్తున్నారాయన.
ఆందోళన అవసరం లేదు
భారత ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన తొలిసారి ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
మానవీయ కోణంలో..
ఉన్న ఉద్యోగులకు శిక్షణలు ఇవ్వడం, సీనియర్ల వేతనాల్లో కోత విధిస్తే.. ఉద్యోగాల కోతకు అడ్డుకట్ట వేయవచ్చునని నారాయణ మూర్తి సెలవిచ్చారు. అంతేగాక, ఉద్యోగుల తొలగింపుపై మానవీయ కోణంలో వ్యవహరించాలని హితవు పలికారు.
పట్టువిడుపులు అవసరం..
ఉద్యోగులు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అదే స్థిరమైన కార్పొరేట్ సంస్థ అని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి. ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ పెట్టుబడిదారి విధానాల్లో కొంత పట్టువిడుపులు ఉంటే తప్ప ఐకమత్యం సాధ్యం కాదన్నారు. భారతీయ ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం ఇది మొదటిసారేం కాదని అన్నారు.
సీనియర్లు ఆలోచించాలి...
ఈ పరిస్థితుల్లో సీనియర్లు చిన్న చిన్న మార్పులకు అంగీకరిస్తే టెక్కీల ఉద్యోగాలు పోవు అని నారాయణ మూర్తి వివరించారు. ఇటువంటి చర్యలనే డాట్కామ్ సంక్షోభంలో కూడా అనుసరించామని తెలిపారు. ఐటీ పరిశ్రమ పెద్దలు కొత్త మార్గాలను అన్వేసించాలని నారాయణ మూర్తి సూచించారు.
ఇలా చేస్తే..
యువ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనిస్తూ వారిని అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలే తప్ప ఉద్యోగం నుంచి తొలగించడం మంచి పద్ధతి కాదని నారాయణ మూర్తి హితవు పలికారు. అవసరాలకు అనుగుణంగా శిక్షణనివ్వడం వల్ల ఉద్యోగాలు పోకుండా అడ్డుకట్ట వేయడంతోపాటు ఉద్యోగులు పెరిగే అవకాశం కూడా ఉందని నారాయణ మూర్తి వివరించారు.