‘‘అతిగా భయపెట్టారు.. ఆందోళన వద్దు, ఈ ఏడాది ఒక్క ఇన్ఫోసిస్ లోనే 20 వేల ఉద్యోగాలు’’
ఈ ఏడాది 20 వేల మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోనున్నట్లు ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా.. కేవలం 400 మందిని మాత్రమే కంపెనీని వీడాల్సిందిగా కోరినట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది 20 వేల మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోనున్నట్లు ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా.. కేవలం 400 మందిని మాత్రమే కంపెనీని వీడాల్సిందిగా కోరినట్లు పేర్కొంది.
భారీ స్థాయిలో ఉద్యోగాలు కోతకు గురైనట్లు వెలువడిన వార్తలపై స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితిని ఎక్కువ చేసి చూపారని, అతిగా భయపెట్టారని ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ కొత్త అవకాశాలను ఐటీ కంపెనీలు సృష్టిస్తాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో అరగంటపాటు భేటీ అయిన తరువాత ఆయన మాట్లాడుతూ 'ఏటా పనితీరు ఆధారం చేసుకుని.. ఉద్యోగులను తొలగించడం అనేది సాధారణ ప్రక్రియేనన్నారు.
నిజానికి ఏటా కంపెనీలోంచి తీసివేసే ఉద్యోగుల సంఖ్య కూడా 300- 400 మాత్రమే ఉంటుందని, తొలగించే ఉద్యోగుల సంఖ్య కంటే కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్య ఎప్పుడూ అధికంగా ఉంటుందని ప్రవీణ్ రావు తెలిపారు.
అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్లు తమ వేతనాల్లో కోత విధించుకుంటే ఐటీ కంపెనీల్లో పనిచేసే యువ ఉద్యోగులను రక్షించుకోవచ్చని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ప్రవీణ్ రావు నిరాకరించారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇన్ఫోసిస్లు కంపెనీ 10,000 మందిని నియమించుకుందని, నిజానికి ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్లే భారీ సంఖ్యల ఉద్యోగాలను నియమించుకుంటున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా వ్యాఖ్యానించారు. టీసీఎస్ కూడా గత మూడేళ్లలో 2.5 లక్షల నియామకాలు చేపట్టిందని, ఈ ఏడాది మరో 20 వేల మందిని నియమించుకోనుందని, మందగమనంపై చర్చలు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.